శ్రీశైల దేవస్థానంలో అన్నదాన సత్రానికి స్థలం కేటాయించాలని గిరిజన ప్రజా సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు వడిత్యా శంకర్ నాయక్, జిపిఎస్ నేతలు ఈవో రామారావుకు వినతి పత్రం సమర్పించారు.
అనంతరం జిపిఎస్ కమిటీ సభ్యులతో కలిసి నూతనంగా జిల్లా నుండి మండల స్థాయి నూతన కమిటీలను ఎంపిక చేశారు. భారతదేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దైవ క్షేత్రం లో గిరిజనులకు అన్నదాన సత్రం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలని వడిత్యా శంకర్ నాయక్ కోరారు. శ్రీశైలంలో డార్మెంటరీ వద్ద ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రజా సమాఖ్య సంఘం ఎన్నో సంవత్సరాల నుండి పోరాటం చేస్తూ ఉద్యమాలకు బాసటగా నిలుస్తూ, అనేక సేవా కార్యక్రమాల్లో ముందుండి నడిపిస్తున్నామని అన్నారు.
శ్రీశైలం మండల జి పి ఎస్ కమిటీ ఇన్చార్జి గా రాములు నాయక్ ను ఎంపిక చేసినట్లు తెలిపారు. శ్రీశైలానికి ఎంతోమంది భక్తులు రోజుకు లక్షల్లో వస్తుంటారని దర్శనానికి వచ్చే భక్తులు అవస్థలు పడుతున్నారని సత్రం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.
మహాశివరాత్రి, బ్రహ్మోత్సవాలు, పండగ దినాల వంటి సమయంలో సత్రం లేకపోవడం వల్ల దర్శనానికి వచ్చే గిరిజన భక్తులు ఎక్కడో చెట్ల కింద తల దాచుకోవాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. ప్రభుత్వం స్పందించి గిరిజనులకు శ్రీశైల దేవస్థానం లో అన్నదాన సత్రానికి స్థలం కేటాయించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు నాయక్, సహాయ కార్యదర్శి రవి నాయక్, ఇన్చార్జి రాములు నాయక్,వైసీపీ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస నాయక్ తదితరులు పాల్గొన్నారు.