లాక్ డౌన్ సమయంలో పేద కుటుంబాలను ప్రభుత్వం గాలికి వదిలేసినందుకు నిరసనగా గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ నిరాహార దీక్ష సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.
కరోనాపై ముందుండి పోరాడున్న వైద్య సిబ్బందికి, పోలీసులకు ఇతర అధికారులకు కనీసం ఈ ప్రభుత్వం రక్షణ కిట్లు కూడా ఇవ్వడం లేదని తక్షణమే వారికి రక్షణ కిట్ లు అందివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రతి పేద కుటుంబానికి రూ.5 వేలు సహాయం చేయాలని, నిరుపేదలు, నిరాశ్రయులకు ప్రతి రోజూ ఆహారం అందించిన అన్నా క్యాంటిన్లను వెంటనే తెరవాలని డాక్టర్ చదలవాడ అరవిందబాబు డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి చేతకాకపోతే లాక్ డౌన్ కాలం మొత్తం తానే అన్నా క్యాంటిన్లను నిర్వహిస్తానని ముఖ్యమంత్రికి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాసినా సమాధానం రాలేదని ఆయన అన్నారు. చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, వరి, పత్తి, మిర్చి పండ్ల తోటల ఉత్పత్తులను ప్రభుత్వమే కొనాలని, సెరీకల్చర్, ఆక్వా, పౌల్ట్రీ రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.