పొట్టకూటి కోసం వివిధ రకాల వస్త్రాలను నేస్తున్న పద్మశాలి, నేతన్నలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ జిల్లా అధ్యక్షులు, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి మొగుళ్ళ భద్రయ్య అన్నారు.
చేనేత దినోత్సవం సందర్భంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్, బీసీ సంఘాలు, చేనేత, పద్మశాలి సంఘాల ఆధ్వర్యంలో చేనేత రంగానికి చేయూతనివ్వాలని కోరుతూ పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ములుగు జిల్లా అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభికి అందజేసి, చేనేత శాలువాతో సత్కరించారు.
అనంతరం మొగుళ్ళ భద్రయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత ఉపాధి రంగంలో చేనేత రంగం ఎంతో గొప్పదని, చేనేత కార్మికులు ప్రస్తుతం కరోన పరిస్థితిలలో వారి జీవితం చిన్నాభిన్నం అయిపోయిందని గత ఐదు నెలలుగా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులకు చేనేత వస్త్రాలు ధరించే విధంగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని, ఇన్సూరెన్స్ పథకంతోపాటు పేరుకుపోయిన వస్త్ర నిలువలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.