ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన వివాదాస్పద తీర్పు అనంతరం అకస్మాత్తుగా బదిలీ అయిన జస్టిస్ ఎస్ మురళీధర్ కు పంజాబ్, హర్యానా హైకోర్టు ఘన స్వాగతం పలికింది. ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో బిజెపి నాయకులు కొందరు ఉద్రిక్తతలకు తావిచ్చే ప్రసంగాలు చేశారని చెప్పిన మురళీధర్ ను అకస్మాత్తుగా పంజాబ్ హర్యానా హైకోర్టుకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన నేటి ఉదయం 10 గంటలకు పంజాబ్ హర్యానా జస్టిస్ గా పదవీ స్వీకారం చేశారు.
చీఫ్ జస్టిస్ రవి శంకర్ ఝా ఆయనతో పదవీ స్వీకారం చేయించారు. ఢిల్లీ హైకోర్టు నుంచి తన బదిలీ అనంతరం జస్టిస్ ఎస్ మురళీధర్ కు స్వాగతం పలికేందుకు న్యాయవాదులు అధిక సంఖ్యలో వచ్చారు. పంజాబ్, హర్యానా హైకోర్టు లో శుక్రవారం నాడు మునుపెన్నడూ లేనంత రద్దీ కనిపించింది. రోడ్లపై ఆయనకు స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీకి నష్టం పంజాబ్ కు లాభం అంటూ బ్యానర్లు కట్టారు.