జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను పాటించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపిడివో, ఎంపీఓ లతో క్రమబద్ధీకరణ పై కలెక్టర్ సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాలుగు సంవత్సరాల సేవాకాలం పూర్తిచేసుకుని, వారి పనితీరు ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో 460 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఉండగా, 302 మంది నాలుగు సంవత్సరాల సేవాకాలం పూర్తి చేసిన వారు ఉన్నట్లు ఆయన తెలిపారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ నేతృత్వంలో, జిల్లా అటవీ అధికారి, పోలీస్ అధికారితో కూడిన కమిటీ విచారణ చేసి, ఇచ్చిన నివేదిక మేరకు క్రమబద్ధీకరణ చేయాల్సి ఉంటుందని అన్నారు. నివేదికలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర, ఎంత ప్రగతి సాధించారు, గ్రామాల్లో రోడ్ల పరిశుభ్రత, మొక్కల పెంపకం, నర్సరీల నిర్వహణ, ఆస్తి పన్నుల వసూలు, చెత్త సేకరణ, పది శాతం గ్రీన్ బడ్జెట్ వినియోగం, జనన, మరణ ధ్రువీకరణల జారీ, పల్లె ప్రగతిలో చేపట్టిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని వంద మార్కులు కేటాయించినట్లు ఆయన అన్నారు.
ఆయా అంశాలు, వారి ప్రగతి ద్వారా సాధించిన మార్కుల ఆధారంగా క్రమబద్ధీకరణ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, జెడ్పి సిఇఓ అప్పారావు, ఎంపిడివోలు, ఎంపీఓ లు తదితరులు పాల్గొన్నారు.