వైద్యారోగ్యశాఖలో నర్సింగ్ పోస్టుల భర్తీ ఒక అడుగు ముందుకు…రెండడుగులు వెనక్కి అన్నట్టుగా తయారైంది. పోస్టులు ఖాళీ అయ్యాక ఏండ్లు గడిస్తే తప్ప నియామక ప్రకటన ఇవ్వలేదు. తీరా నోటిఫికేషన్ ఇచ్చినా కోర్టు కేసుల పేరుతో మూడేండ్లుగా నియామకాలు చేపట్టక తాత్కాలిక సిబ్బందితో నెట్టుకొస్తున్నారు.
హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ వెంటనే భర్తీ కావాల్సిన చేయాల్సిన పోస్టుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అనర్హులను ఎంపిక జాబితాలో చేర్చారనే ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయంపై ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సర్కారు ప్రత్యేకంగా ఒక విచారణ కమిటీని నియమించింది. రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆ కమిటీని ఆదేశించింది. నవంబర్ 13న నియమించిన ముగ్గురు సభ్యులతో కూడిన ఆ కమిటీ ఇంకా పనిని పూర్తి చేయలేదు. నియామక ప్రక్రియ మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని సమాచారం.
వైద్యారోగ్యశాఖ 2017లో 4,300 పారామెడికల్, నర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన విషయం విదితమే. వీటిలో 3,311 స్టాఫ్ నర్సులు, మిగిలినవి పారామెడికల్ పోస్టులున్నాయి. ఈ పోస్టుల భర్తీలో కాంట్రాక్టు నర్సులకు అత్యధికంగా 30 శాతం వరకు అంటే 65 మార్కులు కలిపేందుకు జీవో నెంబర్ 166ను జారీ చేసింది.
ఈ ఉత్తర్వుల ప్రకారం…..ఆరు నెలల సర్వీసు ప్రాతిపదికన గిరిజన ప్రాంతాల్లో పని చేసిన వారికి నాలుగు, గ్రామీణ ప్రాంతాల్లో రెండు, పట్టణ ప్రాంతాల్లో అయితే ఒక మార్కుచొప్పున వెయిటేజీ ఇవ్వనున్నట్టు నోటిఫికేషన్లోనే ప్రకటించింది. ఒప్పంద ఉద్యోగుల నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ (ఆర్ వో ఆర్) పాటించలేదనీ, వెయిటేజీ కల్పించడం రాజ్యాంగ విరుద్ధమంటూ దీనిపై కొంత మంది నిరుద్యోగ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగానే కౌంటర్ దాఖలు చేయడంలో తాత్సారం చేస్తున్నారని నిరుద్యోగ సంఘాలు విమర్శించాయి. ఎట్టకేలకు కౌంటర్ దాఖలు చేయడంతో సుదీర్ఘ విచారణ తర్వాత నియామకాలను చేపట్టేందుకు హైకోర్టు అనుమతిస్తూ తీర్పునిచ్చింది.
అప్పటికే ఉన్న ఖాళీలు, మరోవైపు కరోనాతో పెరిగిన అదనపు సిబ్బంది అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన నియామకాలు కాస్తా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సరిగ్గా చేయకపోవడంతో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. మరింత ఆలస్యానికి అవకాశమిచ్చినట్టయింది.
3800 మంది వెయిటేజీ కోసం దరఖాస్తు చేసుకోగా అందులో 1823 మందికి వెయిటేజీకి అర్హులుగా నిర్ణయించారు. మిగతా దరఖాస్తులను తిరస్కరించారు. వెయిటేజీకి అర్హులుగా నిర్ణయించిన వారిలో పలువురు అనర్హులున్నట్టు ఫిర్యాదులు రావడంతోనే సర్కారు విచారణ కమిటీని నియమించింది.
కోర్టు కేసులతో కాలయాపన కాగా, ప్రస్తుతం కమిటీ విచారణ పేరుతో జాప్యం జరుగుతుండడంతో ఈ ఏడాదైనా పోస్టులు భర్తీ అవుతాయా? అనే అనుమానం వ్యక్తమవుతున్నది. అధికారులు నిర్ణయించిన అర్హుల జాబితాలో అనర్హులు ఉన్నట్టే, తిరస్కరించిన దరఖాస్తులు దాదాపు 2000 వరకున్నాయి. వారిలో అర్హులుంటే వాటినీ పరిశీలించాల్సి ఉంటుంది. దీంతో మొత్తం ప్రక్రియలో మరింత ఆలస్యం జరిగే అవకాశాలు లేకపోలేదు.