ఓ వైపు జీహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికల కోలాహలం కొనసాగుతుండగా నగరంలో భారీగా నగదు పట్టుబడటం సంచలనం కలిగిస్తోంది. బుధవారం 20.85 లక్షలు, గురువారం 18.5 లక్షలు, శుక్రవారం 18.65 లక్షలు పట్టుబడ్డాయి. కాగా నిన్నటితో (శుక్రవారం) నామినేషన్ల ఘట్టం పూర్తయింది.
కాగా నామినేషన్ల గడువు ముగిసేసరికి గ్రేటర్లోని మొత్తం 150 వార్డులకు (డివిజన్లకు)గాను 1,932 మంది అభ్యర్థులు 2,602 నామినేషన్లు సమర్పించారు. వారిలో ఇండిపెండెంట్ల నుంచే 650 నామినేషన్లు వచ్చాయి. చివరి రోజైన శుక్రవారం ఒక్కరోజే 1,412 మంది 1,937 నామినేషన్లు దాఖలు చేశారు.
150 వార్డుల్లో 1932 అభ్యర్థులు బరిలో నిలవగా, మొత్తం నామినేషన్ల సంఖ్య 2602కు చేరింది. పార్టీల వారీగా నామినేషన్లను గమనిస్తే బీజేపీ 571, కాంగ్రెస్ 372, టీఆర్ఎస్ 557, టీడీపీ 206, ఎంఐఎం 78, సీపీఐ, సీపీఎం 22, 21 నామినేషన్లను వేశారు.
కాగా శుక్రవారం నుంచి ఆయా ప్రాంతాల్లో పోలీసులు భారీగా చెక్పోస్టులను ఏర్పాటు చేసి అనుమానం వచ్చిన ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆయా రాజకీయ పార్టీల నడుమ మాటల తూటాలు పేలుతుండడంతో ఆయా పార్టీలపై ఇప్పటికే ఇంటలిజెన్స్ నిఘాను ఏర్పాటు చేశారు. అలాగే ఎలక్షన్ కమిటీ కూడా పూర్తిగా రంగంలోకి దిగి మైక్రో అబ్జర్వర్లు (సూక్ష్మ పరిశీలకులను) రంగంలోకి దింపింది.