రాష్ట్ర ప్రభుత్వం మరోసారి రాయలసీమకు దగా చేసిందని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవి శంకర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ అకాడమీ రాయలసీమకిస్తానని మాట ఇచ్చి, జీవో ఇచ్చి ఇప్పుడు మాట మార్చి దాన్ని గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేయడం అన్యాయమని తీవ్రంగా ఆక్షేపించారు.
శనివారం నాడు ఆర్ సి పి రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అక్టోబర్ 19వ తేదీన జీవో నెంబర్ 152 ప్రకారం కర్నూల్లో జ్యుడీషియల్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, దుర్మార్గం ఏమంటే అదే నెల 24వ తేదీన అకాడమీని మంగళగిరి దగ్గర ఉన్న ఖాజా కు మారుస్తూ రహస్య ఉత్తర్వులు ఇవ్వడం ఈ ప్రభుత్వ కు కుహనా వైఖరికి అద్దం పడుతుందని ధ్వజమెత్తారు.
ఇంతకుముందే కృష్ణ యాజమాన్య బోర్డు విశాఖకు తరలించి మోసం చేసిన వైసిపి, మరోసారి జ్యుడీషియల్ అకాడమీ నీ మంగళగిరి కి తరలించి తీవ్రమైన ద్రోహానికి, దగా కి పాల్పడిందని తీవ్రంగా మండిపడ్డారు. వైసిపి మాయలో బతుకుతున్న మేధావులు, రాయలసీమ ఉద్యమకారులు ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించాలని పలికారు.
వైసీపీకి రాయలసీమ మీద ఏ మాత్రం ప్రేమ, దయ లేదని ఓట్ల కోసం రాయలసీమను వాడుకుంటున్న దౌర్భాగ్యులని విమర్శించారు. రాయలసీమ ఉద్యమకారులందరూ దీనిని ఖండించాలని కోరారు. రాయలసీమలోని రాజకీయ పార్టీలు అన్నీ దీనిపై వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో ఆర్ సి పి రాష్ట్ర కమిటీ సభ్యులు మక్బూల్ భాష, కే. శంకర్ లు పాల్గొన్నారు.