కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తినడానికి తిండిలేక ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడానికి సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ముందుకు వచ్చారు. ఇప్పటి వరకూ పారిశుద్ధ్య కార్మికులకు చాయ్ బిస్కెట్లు అందచేసిన ఆమె నేటి నుంచి పేద ప్రజలకు ఆహారాన్ని అందించేందుకు కూడా ప్రయత్నం ప్రారంభించారు.
లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది పేదలు ఆకలితో అలమటిస్తున్నారని వారికి తనకు తోచిన విధంగా సాయం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆమె తెలిపారు. రోజు వారీ పనులు లేక సంపాదన లేక వారు ఆకలితో అలమటిస్తున్నారని కాట్రగడ్డ ప్రసూన అన్నారు.
ప్రభుత్వ పథకాలు కొందరికే చేరుతున్నాయని ఆమె అన్నారు. రేషన్ కార్డు ఉన్నవారు, రేషన్ కార్డు లేకపోతే ఓటరు ఐడి లేదా ఆధార్ కార్డు ఉన్నవారు, వలస కూలీలను మాత్రమే దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పథకాలు అమలు అవుతున్నాయని ఆమె అన్నారు.
ఇవి లేని వారు ఎంతో మంది ఉన్నారని, కనీసం నిలువ నీడ కూడా లేని పేదలు ఆకలితో ఉంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారు చిన్న పనులు చేసుకుని లేదా ఎవరిదగ్గర అయినా బిచ్చం ఎత్తుకుని బతికే వారని వారికి ఇప్పుడు ప్రభుత్వం సాయం అందడం లేదని ఆమె అన్నారు.
అలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని తాను తన శక్తి మేరకు ఆహారం అందచేస్తున్నట్లు కాట్రగడ్డ ప్రసూన తెలిపారు.