సంక్షేమ పథకాల గురించి ముఖ్యమంత్రి జగన్ డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదమని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ తులసిరెడ్డి అన్నారు. జగన్ సంక్షేమ పథకాలు ఆంజనేయుని ముందు పిల్ల కోతి కుప్పి గంతులు వేసినట్లుందని ఆయన అన్నారు.
1975 లోనే ఇందిరా గాంధీ ప్రారంభించిన 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమంలో అన్ని సంక్షేమ పథకాలను చేర్చి కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేశాయని ఆయన గుర్తు చేశారు. జగన్ పాలనలో సంక్షేమం సంక్షోభంలో పడిందని తులసిరెడ్డి అన్నారు. అమ్మ ఒడి, ఆసరా, చేయూత తదితర సంక్షేమ పథకాల ద్వారా ఇస్తున్న నగదును నాన్న బుడ్డి ద్వారా ప్రభుత్వం లాక్కొంటోందని ఆయన ఎద్దేవాచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేసిన అమ్మ హస్తం, బంగారు తల్లి తదితర మహిళా సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆయన తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాంగ్రెస్ ప్రారంభించిందని ఆయన తెలిపారు.
ఒక్కొక్క సంఘానికి కాంగ్రెస్ హయాంలో రూ.5 లక్షల వరకు సున్నా వడ్డీ పథకం వర్తించేది. జగన్ పాలనలో రూ.3 లక్షలకు కుదించడమైనదని తెలిపారు. ముఖ్యమంత్రికి సంక్షేమం పట్ల చిత్తశుద్ది ఉంటే వెంటనే రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు పరచాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.