ప్రజాచైతన్య యాత్రలో భాగంగా విశాఖ పట్నం వెళ్లిన చంద్రబాబునాయుడిని ఎయిర్ పోర్టు నుంచి బయటకు వెళ్లనీయకపోవడం పై దాఖలైన కేసు విచారణ నేడు ఏపి హైకోర్టులో జరిగింది. ఫిబ్రవరి 27న విశాఖలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడంపై హైకోర్టులోటీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు న్యాయవాది కృష్ణారెడ్డి వెల్లడించారు. న్యాయవాది కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈనెల 12న డీజీపీ గౌతమ్ సవాంగ్ కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించిందన్నారు. సెక్షన్ సీఆర్పీసీ 151పై డీజీపీ వివరణ ఇవ్వాలని హైకోర్టు పేర్కొంటూ తదుపరి విచారణ ఈనెల 12కు వాయిదా చేసిందన్నారు.
అధికార పార్టీకి చెందిన వందల మంది కార్యకర్తలు వచ్చి చంద్రబాబుపై చెప్పులు, కోడిగుడ్లతో దాడి చేస్తే పోలీసులు వారిని కంట్రోల్ చేయకుండా అనుమతి తీసుకుని పర్యటనకు వచ్చిన చంద్రబాబును 151 సెక్షన్ కింద ఎందుకు అదుపులోకి తీసుకున్నారంటూ పోలీసులతీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసిందని కృష్ణారెడ్డి తెలిపారు.