అమరావతి రాజధాని విషయంలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరొకమారు ఆశాభంగం కలిగింది. పరిపాలనావికేంద్రీకరణ చట్టంపై ఉన్న స్టేటస్ కో ను రద్దు చేయాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వ వాదనను హైకోర్టు పట్టించుకోలేదు. ఈ నెల 27 వరకూ స్టేటస్ కోను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం తరపున రాకేశ్ ద్వివేదీ వాదనలు వినిపిస్తున్నారు. ఆయన ఢిల్లీ లో ఉండి అక్కడ నుంచి వాదనలు వినిపిస్తున్నారు. ఆన్ లైన్ లో ఇబ్బందులు ఉన్నాయని హైకోర్టులో నేరుగా విచారణ జరపాలని పలువురు న్యాయవాదులు కోరారు.
అయితే కరోనా కారణంగా నేరుగా హైకోర్ట్ లో వాదనలు వినిపించలేమని ప్రభుత్వం తరపున న్యాయవాది రాకేశ్ ద్వివేది కోర్టుకు వెల్లడించారు. ఇది ఇలా ఉండగా హైకోర్టులో ఒకే అంశంపై ఒకే రోజు 63 పిటీషన్లు దాఖలు అయ్యాయి. రాజధాని అమరావతి అంశంలో ఇంత పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలు కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నది.
అమరావతి రైతులు న్యాయ స్థానాలలో తమకు న్యాయం జరుగుతుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంలోని ఒక కీలక వ్యక్తి రైతులను పిలిచి పలు రకాల తాయిలాలు ప్రకటించినా వారు అంగీకరించలేదు. రాజధానిగా అమరావతి కొనసాగించడం తప్ప వేరే అంశాలు తమకు అవసరం లేదని వారు వెల్లడించినట్లు తెలిసింది.