రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందని, అభివృద్ధి పనులకు నిధులు లేవని, ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఉదారంగా ఆదుకోవాలని కోరుతూ 15వ ఆర్ధిక సంఘాన్ని రాష్ట్రప్రభుత్వం కోరింది. రానున్న ఐదేళ్ల కాలానికి కనీసం 9.94 లక్షల కోట్ల రూపాయలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
రాష్ట్ర విభజన అనంతరం ఎదుర్కున్న సమస్యలతో పాటు, కరోనా కాలంలో వచ్చిన అనేక సమస్యలను వివరించింది. వివిధ రంగాల్లో రాష్ట్ర పరిస్థితి ఎలా ఆందోళనకరంగా మారిందో 108 పేజీల సుదీర్ఘ లేఖలో వివరించింది. ఈ సమస్యలను అధిగమించాలంటే రానున్న ఐదేళ్ల కాలానికి భారీగా నిధులు విడుదల చేయడంతో పాటు, అదనంగా అనేక కేటాయింపులు చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది.
ప్రభుత్వం చేసిన విజ్ఞప్తుల్లో రాష్ట్రానికి ఇవ్వవలసిన స్పెసిఫిక్ గ్రాంట్స్ను తక్షణం మంజూరు చేయాలని, ఈ పద్దు కింద రూ.3.26 లక్షల కోట్లు ఇవ్వాలని కోరింది. దీనిలో పోర్టులు, రైల్వేలకు నాలుగు వేల కోట్ల రూపాయలు, రోడ్లకు వెయ్యి కోట్లు, పోలీసు శాఖకు రూ.2,228 కోట్లు, ఆరోగ్యశాఖ అవసరాలకు రూ.13,942 కోట్లు, పాఠశాలల మౌలికాభివృద్ధికి రూ.18,012 కోట్లు కావాలని కోరింది.
పట్టణాల్లో మౌలికాభివృద్ధికి రూ.12,600 కోట్లు, పారిశ్రామిక వాడల అభివృద్ధికి రూ.43,093 కోట్లు, వెనుకబడిన జిల్లాలకు రూ.22,250 కోట్లు మంజూరు చేయాలని కూడా విజ్ఞప్తి చేసింది. రాజధాని నగర నిర్మాణం, అభివృద్ధి కోసం రూ. 60,123 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించింది.
దీనికి సంబంధించి ఇచ్చిన వివరణలో అమరావతి పేరు గాని, రాజధానిని ఎక్కడ నిర్మించనున్నారన్న విషయాన్ని కానీ ప్రభుత్వం ప్రస్తావించలేదు. అదే సమయంలో, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో రాజధానిలో రాజ్భవన్, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుందంటూ పేర్కొన్న అంశాన్ని ప్రస్తావించారు. రాజధాని నిర్మాణానికి 1,09,023 కోట్ల రూపాయలు అవసరమౌతాయని ప్రభుత్వం అంచనా వేసిందని. 62,623 కోట్ల రూపాయలకు డిపిఆర్ రూపొందించిందని పేర్కొన్నారు.
2,500 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం 1,500 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటికి ఇచ్చిందని తెలిపింది. న్యాయ వ్యవస్థ భవనాలకు 1,849, శాసనవ్యవస్థ కోసం 1,397, పరిపాలన వ్యవస్థకోసం 5,099 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని తాజా అంచనాలో పేర్కొంది.
విశాఖ అభివృద్ధికి 4 వేలకోట్లు పాలనా రాజధానిగా చెబుతున్న విశాఖ నగర అభివృద్ధికి మరో రూ.4 వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని ప్రతిపాదించింది. ఈ నిధులతో రోడ్లు, తాగునీరు, విద్యుత్, అవసరమైన భవనాలకు ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర అభివృద్ధికి విశాఖను మూలస్థంభంగా ప్రభుత్వం అభివర్ణించింది. హైదరాబాద్ తరహాలో విశాఖ నగరం అభివృద్ధి చెందుతుందని పేర్కొంది.