ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విరివిగా పరిశ్రమలను స్థాపించడానికి అన్ని రకాల సదుపాయాలను కల్పించేందుకు తగిన కృషి చేయాలని ఏపీఐఐసీ చైర్ పర్సన్ ఆర్.కె రోజా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్. కరికల్ వలవన్ ను కోరారు. నేడు సచివాలయం లో ఇతర అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.
పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కరికల్ వలవన్ ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏపీఐఐసీ ద్వారా అమలవుతున్న వైజాగ్ – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ పనులను తక్షణమే చేపట్టవలసినది చైర్ పర్సన్ రోజా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ని కోరారు.
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని కోసల నగరం లో ప్రతిపాదించిన ఇండస్ట్రీయల్ పార్క్ పనులు వేగవంతం చేయాలని, వడమలపేట మండలం పాదిరేడు అరణ్యంలో ప్రతిపాదించిన EMC-III కి సంబంధించిన భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని ఆమె కోరారు. దీనివల్ల ఎక్కువ పరిశ్రమలను స్థాపించడానికి అదేవిధంగా ఉపాధి కల్పనకు పెంపొందించడానికి వీలవుతుందని ఆమె వివరించారు.
రాష్ట్రంలో వివిధ పరిశ్రమలకు కేటాయించిన ఏపీఐఐసీ స్థలాలను పరిరక్షించడం తో సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పరిశ్రమలు స్థాపించడానికి ప్రోత్సాహం అందించే విధంగా తగిన అన్ని చర్యలను తీసుకోవాలని ప్రత్యేక కార్యదర్శిని రోజా కోరారు.