ఎన్టిఆర్ విగ్రహ ఆవిష్కరణ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఖమ్మం లోని లకారం టాంక్ బండ్ వద్ద ఎన్టిఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా కృష్ణుడి రూపంలో వున్న 54 అడుగుల ఎన్టిఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, హైకోర్ట్ విగ్రహ ఏర్పాటుపై స్టే ఇచ్చింది.
ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న ఈ విగ్రహ ఏర్పాట్లు జరుగుతుండగా కృష్ణుడి రూపంలో ఎన్టిఆర్ విగ్రహ ఏర్పాటుపై ఇస్కాన్, యాదవ సంఘం ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విగ్రహ ఏర్పాటు వల్ల భగవంతుడైన కృష్ణుడు ఎన్టిఆర్ లాగే వుంటాడని భవిష్యత్తు తరాలకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఖమ్మంలో ఆందోళనలు కూడా జరిగాయి.
ఈ క్రమంలో ఎన్టిఆర్ విగ్రహ ఏర్పాటును నిలిపివేయాలని కూరుతూ ఇస్కాన్, యాదవ సంఘం ఆధ్వర్యంలో హైకోర్ట్ లో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన న్యాయస్థానం విగ్రహ ఏర్పాటుపై స్టే విధించింది. అలాగే విగ్రహ ఏర్పాటులో భాగస్వాములుగా వున్న రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు నిర్వాహకులకు నోటిస్ జారీ చేసింది. విగ్రహ ఏర్పాటుకు వ్యతిరేకంగా 14 పిటిషన్లు దాఖలు కావటం విశేషం.
అన్నింటిని ఒకేసారి విచారించిన న్యాయస్థానం తదుపరి వుత్తర్వులు ఇచ్చేవరకు విగ్రహo ఏర్పాటు చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే ఖమ్మం చేరుకున్న విగ్రహాన్ని ఈ నెల 28వ తేదీన ఆవిష్కరించాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమానికి మంత్రి అజయ్ తో పాటు సినీ నటుడు జూనియర్ ఎన్టిఆర్ హాజరు కానున్నారు. కోర్టు ఆదేశాలతో విగ్రహ ఏర్పాటు నిలిచిపోనున్నది.