వారికి ఇల్లు లేక కాదు. తిండిలేక కాదు. అన్నీ ఉన్నా విధి నిర్వహణలో భాగంగా రోడ్లపక్కనే తింటున్నారు. రోడ్లపైనే ఉంటున్నారు. కరోనా ప్రభావంతో అందరూ ఇళ్లకే పరిమితం కావాలని చెప్పే పోలీసులు రోడ్లకే పరిమితం అవుతున్నారు. రోడ్డే వారికి ఇల్లులా మారింది.
రోడ్డు పక్కన అరుగులే డైనింగ్ టేబుల్, అక్కడ ఏదైనా షెల్టర్ ఉంటే అదే పడుకోవడానికి వాడుతున్నారు. సమయానికి తిండిలేకపోయినా, రోజుల తరబడి నిద్రలేకపోయినా డ్యూటీలకే అంకితమైన బతుకులు వారివి. సూర్యాపేటజిల్లా హుజుర్ నగర్ లో కనిపించిన దృశ్యం ఇది.
పోలీసులు ఎలాంటి స్వార్థం లేకుండా చేస్తున్న సేవలకు నిదర్శనం ఇది. భార్య పిల్లలను వదిలి తమ డ్యూటీ ముఖ్యమని రోడ్ల ప్రక్కన కాలవల వెంట ఎర్రటి ఎండలోనే తమ ఆకలి తీర్చుకుంటూ కరోనా అనే వైరస్ పై యాంటీ వైరస్ లాగా రేయనక పగలనక 24 గంటలు పనిచేస్తున్న హుజూర్ నగర్ పోలీసులు వీరు. వైరస్ ఎంత ప్రమాదకరమో తెలిసి కూడా వైరస్ కు ఎదురు నిలబడి పోరాటం చేస్తూ, ప్రజలను కాపాడుతూ “సర్వేజనాః సుఖినోభవంతు” అన్న సూక్తి కి ఆదర్శంగా నిలిచిన హుజూర్ నగర్ పోలీసులు.