మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ పై చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు పులివర్తి నాని అన్నారు. రాజకీయ విమర్శలు మాని వ్యక్తిగతంగా విమర్శలకు దిగిన పోసాని కృష్ణ మురళీని సినీ ఇండస్ట్రీ నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
తిరుపతి రూరల్ మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం చిత్తూరు జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ పులివర్తి నాని మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం, మండలం, గ్రామం నుంచి అధ్యక్షులు, కార్యదర్శులు నిరసన తీర్మానం చేశారని అన్నారు.
ఈ తీర్మానాలను రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్ లకు పోస్ట్ ద్వారా పంపిస్తామని చెప్పారు. ఇదే ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడును నడిరోడ్డుపై కాల్చిపడేయాలని అన్న విషయాన్ని ప్రజలు మరిచిపోలేదన్నారు.
మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అవంతి శ్రీనివాస్, అనీల్ కుమార్ లు ఏవిధంగా వ్యాఖ్యానిస్తున్నారో అందరికీ తెలిసిందే అన్నారు. అలాగే గత రెండు రోజులుగా నటుడు పోసాని కృష్ణ మురళి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలకు దిగడం బాధాకరమన్నారు. రాజకీయ విమర్శలు మాని కుటుంబసభ్యులను అవమానించే విధంగా మాట్లాడిన పోసానిని సినీ ఇండస్ట్రీ బహిష్కరించాలని కోరారు.
ఇకనైనా వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఈశ్వర్ రెడ్డి,పల్లినేని సుబ్రమణ్యం నాయుడు, తిరుమల రెడ్డి,అమిలినేని మధు,హేమాంబరధరరావు, గౌస్ బాషా,గిరిధర్,ముని కృష్ణారెడ్డి,సోమశేఖర్ రెడ్డి, జనార్ధన్ నాయుడు,ఢిల్లీనాథ్ రెడ్డి,కత్తి సుధా,సురేంద్ర నాయుడు,రాజా,భాస్కర్ రెడ్డి, ముని హేమంత్ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు.