హైదరాబాద్ లోని బేగం బజార్ లో నిర్మిస్తున్న చేపల మార్కెట్ లో పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతున్నదని తెలంగాణా ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. టిఆర్ఎస్ బిజెపి నాయకులు దళారులుగా అవతారమెత్తి మత్స్యకారులకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈ వ్యాపార సముదాయం లో ఏ ఒక్క మత్స్యకారుడి కి అన్యాయం జరిగినా ఊరుకునే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి మత్స్యకారుల అందరికీ న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వారికి అండగా ఉంటుందని సాయికుమార్ తెలిపారు. 2013లో అప్పటి మంత్రి, గోషామహల్ ఎమ్మెల్యే ముఖేష్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూడు కోట్లు కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు కోట్ల 25 లక్షలు కేటాయించేలా చేసి దీని నిర్మాణం ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు.
నిర్మాణ ఖర్చు11 కోట్లకు తీసుకెళ్ళడమే కాకుండా మత్స్యకారులకు అన్యాయం జరిగే విధంగా ఇప్పుడు వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ విధంగా చేయడం వల్ల మూడు వందల పైచిలుకు మత్స్యకారసభ్యులు రోడ్డున పడతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.