కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో ఘోరం జరిగింది. భార్యను వేధింపులకు గురిచేస్తూ చీర కొంగుతో గొంతుకును బిగించిన భర్త ఆమెను చంపేశాడు. ఆస్పరి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగిన ఈ సంఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఆస్పరి మండలం కారుమంచి గ్రామానికి చెందిన హరిజన రంగస్వామి, ఎమ్మిగనూరు మండలం, వెంకటాపురం గ్రామానికి చెందిన అంజనమ్మ(28)కి ఏడేళ్ళ క్రితం వివాహం జరిగింది.
వీరికి మేరీరాణి(6), అక్షయ్ కుమార్(4), రంజిత్ కుమార్ 7నెలల బాబు ఉన్నారు. అంజనమ్మ గ్రామ సచివాలయ కేంద్రంలో గ్రామ వాలంటరీ గా పనిచేస్తుంది. వివాహం అనంతరం కొన్నాళ్లు సజావుగా సాగిన వారి కాపురంలో భార్యపై అతడికి అనుమానం మొదలైంది. దీంతో అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేసే వాడని, తరచూ భార్యా భర్తల మద్య విభేదాలు కొనసాగుతుండేవి.
దీంతో ఉగాది పండుగ అనంతరం భార్య అంజనమ్మ భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. బుధవారం రాత్రి భర్త రంగస్వామి వెంకటాపురం గ్రామంలో ఉన్న భార్య అంజనమ్మను తనకు ఆరోగ్యం సరిగా లేదని, మన ఇంటికి వెళ్ళిపోదామని నచ్చజెప్పి కారుమంచి గ్రామంలోని తన ఇంటికి పిలుచుకు వచ్చాడు. గురువారం ఉదయం భార్య, భర్తల మధ్య ఏమి జరిగిందో తెలియదు అంజనమ్మ శవమై ఇంట్లో పడి ఉంది.
భార్య చనిపోయినట్లు తెలుసుకున్న భర్త రంగస్వామి ఇంటికి గడియపెట్టి పరారయ్యాడు. ఉదయం పదిన్నర గంటల సమయంలో పిల్లలు అరుపులు విన్న సమీప బంధువైన హనుమక్క ఇంటికి గడియ పెట్టి ఉండడంతో గడియ తీసి లోపలికి వెళ్లి చూడగా అంజనమ్మ విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి పోలీసులకు సమాచారాన్ని అందించారు.
సమాచారం తెలుసుకున్న ఆలూరు సీఐ ఈశ్వరయ్య, ఎస్ఐ వరప్రసాద్ పోలీసు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని సమీక్షించారు. నిందితుడు పరార్ కావడంతో గాలింపు చేపట్టినట్లు ఆలూరు సిఐ ఈశ్వరయ్య తెలిపారు.