ఏపీలో జగన్ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర వ్యాఖ్యలు చేసిన అనంతరం బీజెపీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయినట్లు కనిపిస్తున్నది. బీజేపీ నేతల్ని జగన్ ప్రభుత్వం శత్రువులుగా చూస్తున్నట్లు కనిపిస్తున్నది. 2021లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్ శ్రీవారి సేవ కోసం తిరుమల వచ్చారు. అప్పటిలో బీజేపీతో బంధం ఎంతో పటిష్టంగా ఉండేదోమోగానీ….. అధికారంలో ఉన్న పెద్దలు ఆయన అడుగులకు మడుగులొత్తారు. అప్పటిలో మంత్రి గోయల్ తిరుమల పర్యటన సందర్భంగా ప్రభుత్వ పెద్దలు రెడ్ కార్పెట్ పరిచారు. రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన తో పాటు టీటీడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అప్పటి ఈఓ జవహర్ రెడ్డి గోయల్ పర్యటన ఆసాంతం ఆయన వెంట వున్నారు. అదే గోయల్ మంగళ వారం తిరుమలకు వచ్చినపుడు సాధారణ ప్రోటోకాల్ తప్ప ప్రభుత్వ పెద్దలు ఎవరూ కనిపించ లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ తీరు పట్ల గోయల్ మనస్తాపం చెందినట్లు సమాచారం.
గత నాలుగేళ్లుగా కేంద్ర మంత్రులు తిరుమల పర్యటన సందర్భంగా రేణిగుంట ఎయిర్ పోర్ట్ వద్ద నుంచే ప్రోటో కాల్ తో పాటు శాసనసభ్యులు కానీ మంత్రులు గానీ హాజరై వారి పర్యటన ముగిసే వరకు వారి వెంటే వుండేవారు. అయితే తిరుపతిలో నడ్డా.. విశాఖలో అమిత్ షా సభల అనంతరం ప్రభుత్వ పెద్దల తీరులో మార్పు కనిపించింది. ఇంతలోనే ఇంత మార్పా అంటూ రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఇంతలోనే అంతమార్పా…అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఈ విధంగా తనను అవమానిస్తారని అనుకోలేదో ఏమో కానీ మంగళవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో దర్శనానికి వచ్చారు.
ముందుగా ఆలయం వద్ద ఆయనకు చేరుకున్న ఆయనకు టిటిడి అధికారులు నామమాత్రపు స్వాగతం పలికారు.
చివరకు ఎలాగోలా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారి అనుగ్రహంతో భారతదేశం అన్ని విధాల అభివృద్ధి చెందాలని స్వామి వారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికారు. అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశానికి మరింత సేవ చేసే భాగ్యం తనకు కల్పించాలని, దేశ ప్రజలకు స్వామి ఆశీస్సులు ఉండాలని ఆయన తెలిపారు.