అదనపు కట్నం తీసుకురావాలని అడపడుచులతో కలిసి భార్యను ఓ కసాయి భర్త చితకబాదాడు. దాంతో ఆమెను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.
మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం తాడ్వాయి మండలం కాలోజీవాడి గ్రామానికి చెందిన రజిత(27)ను 20018 లో కామరెడ్డికి చెందిన శ్రీకాంత్ తో వివాహం జరిపించారు. రజిత తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో పెళ్లి తంతు మేనమామ జరిపించారు.
పెళ్లి సమయంలో 2 ఎకరాల వ్యవసాయ భూమి అమ్మి కట్నం ఇచ్చారు. అయితే పెళ్ళైన నెల రోజుల నుంచి అదనపు కట్నం కోసం భర్త శ్రీకాంత్ వేధించసాగాడు. రజిత చదువుకోవడంతో రాజంపేట మండలంలో నాబార్డు విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తూ జీతం కూడా తెస్తుంది.
పెళ్ళైన నాటి నుంచి మధ్యలో ఓసారి 5 తులాల బంగారం కూడా ఇచ్చారు. నెల క్రితం బైక్ కోసం 80 వేల రూపాయలు కూడా శ్రీకాంత్ కు ఇచ్చారు. అయినా వరకట్నం వేధింపులు ఆగలేదు. గురువారం ఇంట్లో గొడవ జరగడంతో పెళ్ళై ఇంట్లోనే ఉంటున్న ఆడపడుచులు స్వప్న, లతలతో కలిసి భార్యను తీవ్రంగా కొట్టాడు శ్రీకాంత్.
5 నెలల క్రితం రజిత గర్భం కూడా కోల్పోయింది. గురువారం జరిగిన గొడవలో రజిత తీవ్ర గాయలపాలైంది. దాంతో ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. భర్త, ఆడపడుచుల వేధింపుల వల్లనే రజిత మృతి చెందిందని రజిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.