రాజకీయoగా తాను వున్న పరిస్థితికి ఎవరినీ నిందించనని, తనను నమ్ముకున్న ప్రజలకోసం ఎన్నికల్లో పోటీ చేస్తానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. కెసిఆర్ అభ్యర్థులను ప్రకటించిన తరువాత ఆయనకు టికెట్ ఇవ్వకపోవటంపై జిల్లా వ్యాప్తంగా ఆయన అనుచరులు సమావేశాలు నిర్వహించడం జరిగింది.
ఈ క్రమంలో హైదరాబాద్ నుండి ఖమ్మం వస్తున్నా తుమ్మలకు జిల్లా సరిహద్దులో వేలాది మంది ఘన స్వాగతం పలికారు. తనకోసం వచ్చిన ప్రతివారికి కృతజ్ఞతలు తెలిపారు. చిరునవ్వుతో అందరిని పలకరించారు .
అక్కడ నుండి ఖమ్మం లోని ఆయన ఇంటి వరకు వేలాది కార్లు వచ్చాయి. గతంలో అనేక మందికి ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో అనేక మంది నేతలకు స్వాగతం పలికినప్పటికీ ఇంతపెద్ద కాన్వాయ్ ఎప్పడు చూడలేదనే పలువురు పేర్కొన్నారు .
ఈ కార్యక్రమంలో తుమ్మల ఫోటో తో మాత్రమే జెండాలు వున్నాయి. ఎక్కడా బీఆర్ఎస్, కేసీఆర్ జెండాలు లేకుండా, కేవలం తుమ్మల ఫొటోలు, ఫ్లెక్సీలనే పెట్టారు. నాయకన్ గూడెం నుంచి ఖమ్మం వరకు ర్యాలీ చేపట్టారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావుకు ఆహ్వానం అందినట్లు సమాచారం.
ఈ సందర్భంగా తుమ్మల భావోగ్వెదానికి లోనయ్యారు. అనంతరం మాట్లాడుతూ 40ఏళ్లుగా ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందని, తనకు టికెట్ రాలేదని కొందరు సంబరాలు చేసుకుంటున్నారని, ఈ జిల్లా ప్రజల కోసం మళ్ళీ ఎన్నికలలో పోటీ చేస్తానని తెలిపారు. అనేక ఆటుపోట్ల మధ్య ప్రజల మద్దతుతోనే ఈ స్థాయికి చేరుకున్నాను అన్నారు.