అన్నమయ్య జిల్లా నందలూరులో చారిత్రక పొందిన శ్రీ సౌమ్యనాధ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి.ఇందులో భాగంగా బుధవారం ఉదయం వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథుని కళ్యాణాన్ని నిర్వహించారు. ఆగమ శాస్త్ర పండితులు ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత సౌమ్యనాథ స్వామికి కల్యాణం నిర్వహించారు.
ముందుగా స్వామివారి కళ్యాణానికి రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లిఖార్జున రెడ్డి దంపతులు ముత్యాల తలంబ్రాలను,జడ్పీ చైర్మన్ అకేపాటి అమరనాధ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలను అందజేశారు.అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం కల్యాణ వేడుక లకు ఉత్సవ మూర్తులను ముస్తాబు చేసి మేళతాళాల మధ్య కళ్యాణ వేదికపై ఆశీనులను చేశారు. పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తులు గోవింద నామస్మరణతో కళ్యాణ మహోత్సవం కన్నులపండువగా నిర్వహించారు.కల్యాణ ప్రాంగణం భక్తిపారవశ్యంతో నిండిపోయింది.
వేదపండితులు, ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో మాంగల్యధారణ, ముత్యాల తలంబ్రాల క్రతువులను నిర్వహించారు.ఈ కల్యాణానికి ఆలయ బ్రహ్మోత్సవాల కమిటీ గౌరవ అధ్యక్షుడు మేడ విజయభాస్కర్రెడ్డి,సమన్వయ కర్త మేడా విజరుశేఖర్రెడ్డి,ఆలయ చైర్మన్ సౌమిత్రి తదితరులు ఆధ్వర్యం వహించారు.కల్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు,ముత్యాల తలంబ్రాలు అందజేసి,అన్నప్రసాదం ఏర్పాటు చేశారు.
పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ స్వచ్ఛంద సంస్థల వారు భక్తులకు సేవలందించారు. కల్యాణ వేదిక ప్రాంగణంలో కొండవీటి జ్యోతిర్మయి ఆధ్వర్యంలో అన్నమాచార్య కీర్తనలను ఆలపించారు. కళ్యాణ వ్యాఖ్యతలుగా సొట్టు సాంబశివమూర్తి, పసుపు లేటి శంకర్ లు వ్యవహరించారు. అదే విధంగా శ్రీ సౌమ్యనాధ ఆలయం బ్రహ్మోత్సవాల కల్యాణ వేదిక పై సినీ నటుడు దర్శకుడు తోట వేణు గోపాల్ సారధ్యంలో శ్రీ సౌమ్యనాధ స్వామి వారి పై గాయకులచే ఆలపించిన పాటల సి.డి ని ఆవిష్కరించారు.