ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసి వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకుండా చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో మారు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలో కౌలు రైతు భరోసా యాత్రలో నేడు ఆయన పాల్గొన్నారు. అన్నం పెట్టే రైతు కన్నీరు పెడితే రాష్ట్రానికి మంచిది కాదు. ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉండదు. తుఫాన్ వస్తే.. ప్రభుత్వం నుంచి పలకరింపు లేదు. ఇంతమంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వానికి కనికరం లేదు. నా వంతు నేను కష్టపడి సంపాదించిన సొమ్ము పంచుతున్నా. దానికి కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారు అంటూ పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు.
వైసిపి నేతలకు చిల్లర వేషాలు..తప్ప పాలనపై దృష్టి లేదు. పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వంటి వాటిపై కాకుండా పనికిరాని విషయాలపై వైసిపి ఫోకస్ చేస్తుంది.144 సెక్షన్ ఉంది కాబట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయను. నాకు ఎలాగైతే ఆంక్షలు,నిబంధనలు ఉన్నాయో,వైసిపి నేతలకు కూడ కూడా అలాగే వర్తింపజేయండి అని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వం రాదు. రానివ్వం…. అని ఆయన ప్రకటించారు. అణగారిన వర్గాలు, అధికారం చూడని వారు అధికారంలోకి రావాలంటే… మీమెంతో మాకంత అనే విధంగా దామాషా పద్ధతి పాటించాలి. అణగారిన వర్గాలకు సాధికారత ఉండాలి. అధికారం చూడని వారికి అధికారం వచ్చేలా చేయాలి. అదే జనసేన లక్ష్యం అని ఆయన వెల్లడించారు.
వైసిపి బిసి సభలో రొయ్యల వేపుడు, చికెన్ ప్రై, బిసి లకు బిర్యానీలు పెట్టాం అని ప్రచారం చేశారు. బిసిలంటే బిర్యానీ కోసం ఎగబడే వారు కాదు. కొద్దీ మందికి పదవులు ఇస్తే బిసి సాధికారత రాదు. పిచ్చి ఆలోచనలు తప్ప..బిసి విద్యార్థులకు పోషక ఆహారం ఇస్తున్నారా..?స్కాలర్ షిప్ లు, సమయానికి ఇస్తున్నారా? ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు? అని ఆయన ప్రశ్నలు గుప్పించారు.
వైసిపి వ్యతిరేక ఓటు చీలనవ్వను. అదే మాటతో ఉన్నా.ప్రభుత్వ వ్యతిరేక శక్తులను కలుపుతా.వైసిపి ప్రభుత్వాన్ని పడగొడతా.కొత్త ప్రభుత్వం రాకపోతే భవిష్యత్ నాశనం అవుతుంది.ఎవరూ అపుతారో చూస్తా.కొత్త యువ నాయకత్వం రావాలి.నేను వచ్చే రెండు తరాల కోసం ఆలోచిస్తున్నా.మీరు బలంగా కోరుకుంటే సీఎం అవుతా.అవినీతి రహిత పాలన ఇస్తా.ప్రభుత్వం ఏర్పడితే అన్నింటిపై శ్వేతపత్రం రిలీజ్ చేస్తా.ప్రజలకు తప్ప ఎవరికి కొమ్ము కాయను.రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చేస్తా, రైతు పక్షాన నిలుస్తా.నూతన పాలసీలు తీసుకొస్తా అని ఆయన ప్రకటించారు.
వైసిపి గాడిదలు ఎం కూసినా ఓడి పోవటం ఖాయం. వారాహితో రోడ్ల మీద తిరుగుతా. ముఖ్యమంత్రితో సహా ఎవరైనా వారహిని ఆపండి. నేనేంటో చూపిస్తా. బెదిరించే నాయకులు ఉంటే ఎదురించే యువత ఉండాలి.నన్ను ఆపాలని చుస్తే లేస్తా. బలమైన సమాధానం ఇస్తా. అలుపెరుగని యుద్ధం ఇస్తా అంటూ నిప్పులు కురిపించారు. 2019 ఎన్నికల్లో గాజు గ్లాసు కాదు, నా గుండెల్లో గునపం అన్న అంబటి రాంబాబు..నాపై విమర్శలు మాని, ముందు పోలవరం ఫినిష్ చేయండి.పెన్షన్లు, ఇన్సురెన్స్ ల పై కమిషన్లు తీసుకోవటం,శవాల మీద పేలాలు ఎరుకునే నీచ సంస్కృతి నాకు లేదు.అది అంబటికే ఉంది. అంబటి కాపుల గుండెలపై కుంపటి అని పవన్ కల్యాణ్ అన్నారు.
నేను పుట్టిన కులం నాయకులతో నాపై విమర్శలు చేయిస్తున్నారు. బూతులు తిడుతున్నారు. వైసిపి గాడిదలకు చెప్తున్నా మీ గాండ్రిపులకి నేను భయపడను. గుర్రం జాషువా స్ఫూర్తిగా తీసుకున్నా..అన్ని కులాలను గౌరవిస్తా. అంబెడ్కర్ ఆశయాల సాధనకు కృషి చేస్తా అని ఆయన అన్నారు. భవిష్యత్తు ఎన్నికల్లో వైసిపి హింసా మార్గం అనుసరిస్తుంది..గొడవలు, దాడులు ఉంటాయి. జనసేన వీర మహిళలు, నాయకులు అన్నింటికీ సంసిద్ధం కండి. మార్పు రావాలంటే పోరాటం తప్పదు. బాధ్యతగా ఉండండి. నేను అండగా ఉంటాను. ఎన్నికల వ్యూహం నాకొదిలేయండి. అధికారం దిశగా ఎలా అడుగులు వేయాలో చూస్తా అంటూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు.
ఎం.ఎస్.సుధాకర్, సత్యంన్యూస్.నెట్, పల్నాడు జిల్లా