ఖమ్మం జిల్లా ప్రజల అకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని, గతంలో మాదిరిగా అభివృద్దే లక్ష్యంగా తన పనితీరు ఉంటుందని ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం అసెంబ్లీకి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మాట్లాడుతూ ఈ నెల 30 న జరిగే అసెంబ్లీ ఎన్నికల కు కాంగ్రెస్ పార్టీ తరపున సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే ఆశీస్సులతో ఖమ్మం అభ్యర్థిగా నామినేషన్ వేశానన్నారు. ఆధునిక ఖమ్మం రూపశిల్పిగా ఖమ్మం ప్రజానీకం ఆకాంక్షల కోసం పనిచేస్తానని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను గెలిపిoచి సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలన్నారు.ఆరు గ్యారంటీ పథకాలు అమలుతో తెలంగాణ భవిష్యత్ మారుతుందన్నారు. నిరంకుశ అవినీతి ఆప్రజాస్వామిక పాలనకు వ్యతిరేకంగా ఖమ్మం తో పాటు యావత్ తెలంగాణ ప్రజానీకం చారిత్రక తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఖమ్మం జిల్లాలో గత 4 దశబ్దాలలో తాను చేసిన అభివృద్ధిని చూసి తనకు మరో అవకాశం ఇవ్వాలన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన, జరుగుతున్న విధానాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వాటికి శుభం పలకాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మి నారాయణ, కార్పొరేటర్లు కమర్తపు మురళి, నేతలు రమేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.