మణిపూర్లో జరుగుతున్న పరిస్థితులపై నిజ నిర్ధారణకు వెళ్లిన ప్రతినిధుల బృందంపై ఇంఫాల్ పోలీసులు కక్ష పూరిత చర్యలతో అక్రమ కేసులను బనాయించడాన్ని నిరసిస్తూ తెలంగాణ మహిళా సమాఖ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
తొలుత నగరంలోని బైపాస్ రోడ్డులో గల గిరిప్రసాద్ భవన్ నుంచి ప్రదర్శనగా బయలుదేరిన మహిళా సమాఖ్య నాయకురాలు బైపాస్ రోడ్డులోని దోలేపల్లి పెట్రోల్ బంక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు పోటు కళావతి మాట్లాడుతూ మహిళా సమాఖ్య జాతీయ నాయకురాలు అనీరాజా, నిశా సిద్దులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆమె కోరారు. లేనిపక్షంలో ఈ ఆందోళనను పెద్ద ఎత్తున నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి లతాదేవి, నాయకురాలు సిహెచ్ సీతామహాలక్ష్మీ, పార్వతి, రజని, నాగమణి, రమా తదితరులు పాల్గొన్నారు.