కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే విధంగా భవిష్యత్తు భారతదేశాన్ని 74 వ స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తితో మరింత బలోపేతం చేయాలని ప్రజాపోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి ఉద్ఘాటించారు. ఈ రోజు చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని సంజీవనగర్ కాలనీలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “భారత స్వాతంత్ర్యం కోసం 200 సంవత్సరాలు దేశాన్ని అక్రమంగా పరిపాలించిన బ్రిటీష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా 100 సంవత్సరాల పాటు లక్షలాది మంది ప్రజలు వీరులు అశేష త్యాగాలు గావించారని, వారి పోరాటాల ఫలితంగా నిర్మించబడుతున్న మన భారతదేశం రానున్న విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే విధంగా పాలకులు పటిష్టవంతం చేయాలి.
ప్రభుత్వ విద్యను, ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేయాలని, సామాన్యులకు వైద్యం అందే విధంగా పాలక వర్గాలు చర్యలు తీసుకోవాలని, ఈ ఘోర పరిస్థితుల్లో చిరు వ్యాపారాలు పడిపోయి, కష్టజీవులకు యువతకు ఉపాధి లేక అఘోరిస్తున్నారని, పేదవర్గాల విద్యార్థులు మొబైల్ ఫోన్ కూడా కొనుక్కోలేక ఆన్లైన్ క్లాసులు వినగలిగిన ఆర్థిక స్థోమతలో లేరని, వీటన్నింటిని పటిష్టవంతం చేసే వైపున దేశ ప్రయాణం సాగాలని” ఆయన అన్నారు.
ఈ పతాకావిష్కరణలో ప్రజా పోరాట సమితి జిల్లా నాయకులు కోనేటి యాదయ్య, గుండాల సత్యనారాయణగౌడ్, మేకల భిక్షంగౌడ్, ఎన్నమళ్ల పృథ్వీరాజ్, పాల వెంకట్, పోకల అరుణ్ కుమార్, కాలనీ వాసులైన పాల శేఖర్, జిట్ట నరసింహ, జిట్ట లింగస్వామి, పిల్లి కార్తీక్, చింత ధనుష్ , ప్రొద్దుటూరు వెంకటేశ్వర్లుగుప్తా మరియు తదితరులు పాల్గొన్నారు