సాధారణంగా వర్షం పడితేనో, వాతావరణం అనుకూలించకపోతేనో క్రికెట్ మ్యాచ్లు మధ్యలోనే ఆపేస్తారు. శునకాలు, ఇతర జంతువులు మైదానంలోకి ప్రవేశించినప్పుడు కూడా మ్యాచ్లు నిలిపేసిన సంఘటనలున్నాయి. అదేవిధంగా అభిమానులు, అగంతకులు గ్రౌండ్లోకి వచ్చినప్పుడు కొద్దిసేపు క్రికెట్ కొద్ది సేపు ఆటకు అంతరాయం కలిగిన సందర్భాలున్నాయి.
అయితే ముంబయి వేదికగా టీమిండియా- న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఆదివారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మ్యాచ్ని కవర్ చేసే స్పైడర్ కెమెరా పిచ్ కి తక్కువ ఎత్తులో వచ్చి ఎటూకాకుండా ఆగిపోయింది. వెంటనే గ్రౌండ్ సిబ్బంది మైదానంలోకి వచ్చి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. పైకి లాగేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ సాధ్యపడలేదు.
దీంతో ఏం చేయాలో తోచలేని అంపైర్లు నిర్ణీత సమయానికంటే ముందే టీ విరామం ప్రకటించారు.
స్పైడర్ కెమెరా ఎటూ కాకుండా ఆగిపోవడంతో మైదానంలోని టీమిండియా క్రికెటర్లు సరదాగా ఆటాడుకున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్లు కెమెరా ముందు నిలబడి ‘ ఏయ్..ఇక్కడి నుంచి వెళ్లిపో’ అన్నట్లు సంజ్ఞలిచ్చారు. ఇక స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా బాహుబలి రేంజ్లో కెమెరాని భుజాలమీదకు ఎత్తుతున్నట్లు పోజులిచ్చాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్తో పాటు మిగతా క్రికెటర్లు కూడా కెమెరాతో ఆడుకున్నారు. వీటికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.