వచ్చే ఏడాది పంజాబ్, యూపీ సహా ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రధానపార్టీలన్నీ రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పంజాబ్లో అధికారాన్ని చేపట్టాలన్న సంకల్పంతో కసరత్తులు చేస్తోంది. ఇటీవలనే ఆప్ చీఫ్, డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్లో పర్యటించి పలు హామీలను ఇచ్చారు.
తాము అధికారంలో వచ్చిన వెంటనే పలు పథకాలను చేపడతామంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా కాంట్రాక్టు టీచర్లకు మద్దతు సైతం తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. కాంట్రాక్టు టీచర్లను పర్మినెంట్ చేస్తామని ప్రకటించారు. దీంతోపాటు పంజాబ్ అధికార పార్టీ కాంగ్రెస్పై పలు విమర్శలు సైతం చేశారు. అయితే.. కేజ్రీవాల్ వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు.. కాంగ్రెస్ పంజాబ్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ రంగంలోకి దిగారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ఎదుట నవజ్యోత్ సింగ్ సిద్ధూ నిరసన చేపట్టారు.
తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం ఇంటి వద్ద ధర్నా చేస్తున్న ప్రభుత్వ గెస్ట్ టీచర్లకు ఆయన సంఘీభావం తెలిపారు. వారి నిరసనలో సిద్ధూ కూడా పాల్గొని నినాదాలు చేశారు. ఉపాధ్యాయులతో కలిసి ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతోపాటు ప్లకార్డులను ప్రదర్శించారు.