తాజాగా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య. లుంగీ, టోపీ ధరించిన వ్యక్తులు గతంలో శాంతిభద్రతలకు సవాలుగా మారేవారంటూ బాంబ్ పేల్చారు. 2017కు ముందు లుంగీలు ధరించిన వ్యక్తులు వ్యాపారుల్ని తుపాకులతో బెదిరించేవారని, స్థలాలు కబ్జా చేసేవారని కామెంట్ చేశారాయన.
అయితే, బీజేపీ ప్రభుత్వం వచ్చాక అలాంటి నేరస్థులు కనిపించట్లేదన్నారు మౌర్య. కాగా, ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. యూపీలో ఉండే హిందువుల్లో సగం మంది లుంగీ ధరిస్తారని, మౌర్య వ్యాఖ్యల ప్రకారం లుంగీ ధరించిన వారంతా నేరస్థులేనా? అని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత రషీద్ అల్వీ.
బీజేపీ కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకొని రాజకీయాలు చేస్తోందంటూ నిప్పులు చెరిగారాయన. ప్రజలు బీజేపీ వ్యవహరిస్తున్న తీరును అర్థం చేసుకున్నారని, అది తెలిసి అధికార పార్టీ భయపడుతోందని అన్నారు. ఐదు రోజుల క్రితం మౌర్య ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ క్యాంపెయిన్ అంతా మధుర కేంద్రంగా ఉండవచ్చని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రసాద్ మౌర్య చేసిన కామెంట్స్.. కొత్త చర్చకు దారి తీశారు. ఇక బీజేపీ ఎలాంటి వ్యూహాలు రచిస్తుందో తెలియక తలలు పట్టుకుంటున్నాయి ఇతర పార్టీలు. అయితే, ఇప్పుడే ఇలా ఉంటే.. ఎన్నికలు ముగిసే వరకు మరెన్ని వివాదాస్పద కామెంట్స్ వస్తాయో చూడాలి.