తెలంగాణ పట్టణాలకు మరో మూడు అవార్డులు వచ్చాయి. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, అలంపూర్, కోరుట్ల మున్సిపాలిటీలను ఇండియన్ స్వచ్ఛత లీగ్ ( Indian Swachhata League ) అవార్డులకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. శుక్రవారం నాడు ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర గృహ,పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్ కిశోర్ చేతుల మీదుగా సంబంధిత పట్టణాల మున్సిపల్ కమీషనర్లు , చైర్మన్ లు అవార్డులను అందుకున్నారు.
గార్బెజ్ ఫ్రీ సిటీస్లో భాగంగా ఇండియన్ స్వచ్ఛత లీగ్ అవార్డులను అందించారు. ఇందులో 15వేల లోపు జనాభా ఉన్న పట్టణాల కేటగిరీలో అలంపూర్ పట్టణం ఎంపికైంది. 25 నుంచి 50 వేల వరకు జనాభా ఉన్న పట్టణాల విభాగంలో ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, 50 వేల నుంచి లక్ష జనాభా ఉన్న కేటగిరీలో కోరుట్ల పట్టణాలు ఎంపికయ్యాయి.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కమీషనర్ & డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ,వరంగల్,హైదరాబాదు పట్టణ పరిపాలన శాఖ ప్రాంతీయ డైరెక్టర్లు , పీర్జాదీ గూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, కమీషనర్ రామకృష్ణ,కోరుట్ల మునిసిపల్ కమీషనర్ అయాజ్,అలంపూర్ మునిసిపల్ కమీషనర్ నిత్యానంద్ తదితరులు పాల్గొన్నారు.