విజయవాడ నగరంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. నగరంలో మొన్నటి వరకు లాక్ డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తూ వచ్చారు. లాక్ డౌన్ 5లో సడలింపుల్లో భాగంగా జూన్ 8 నుంచి దేవాలయాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వగా, రెండు రోజులపాటు ట్రయల్ నిర్వహించి, జూన్ 10 వ తేదీ నుంచి బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలోకి భక్తులను అనుమతిస్తున్నారు.
రోజుకు పరిమిత సంఖ్యలోనే అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు. అయితే ఆలయంలో లక్ష కుంకుమార్చన సేవలో విధులు నిర్వర్తిస్తున్న అర్చకుడికి కరోనా వైరస్ సోకింది. దీంతో అర్చకుడిని పిన్నమనేని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అనంతరం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు, అర్చకులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇక బాధిత అర్చకుడితో సన్నిహితంగా ఉన్న వ్యక్తులను గుర్తించి క్వారంటైన్ కు తరలించారు