‘‘మంచి’’ అధికారి దొరక్కపోవడం వల్లనేమో ఆంధ్రప్రదేశ్ లో ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి చాలా కాలంగా పూర్తి స్థాయి బాధుడు లేకుండా అలానే ఉండిపోయింది. ఏ ప్రభుత్వానికైనా ఇంటెలిజెన్స్ విభాగం అత్యంత కీలకమైనది. ఇంటెలిజెన్స్ విభాగం రాష్ట్రంలో జరుగుతున్న కీలక పరిణామాలను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి తెలియచేస్తుంటుంది.
రాజకీయ కార్యకలాపాల నుంచి శాంతిభద్రతల విషయం వరకూ అన్నింటిని క్రోడీకరించి ముఖ్యమంత్రికి తెలిపే బాధ్యత ఇంటెలిజెన్స్ విభాగానికి ఉంటుంది. అంతటి ముఖ్యమైన శాఖ కు పూర్తి స్థాయి అధిపతి లేకుండానే ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పరిపాలన సాగిస్తున్నారు.
జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే తెలంగాణ క్యాడర్ ఐపిఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర ను ఆంధ్రాక్యాడర్ కు మార్చుకుని ఆయనకు ఇంటెలిజెన్స్ విభాగాన్ని అప్పగించాలని అనుకున్నారు.
అందుకు అంగీకారం తెలిపిన స్టీఫెన్ రవీంద్ర విజయవాడ వచ్చి అక్కడ పని కూడా ప్రారంభించారు. అధికారికంగా కేంద్రం నుంచి క్లియరెన్సు రాకపోయినా ఆయన కింది స్థాయి అధికారులను మార్చుకుని తన విభాగాన్ని సెట్ చేసుకున్నారు. అయితే కేంద్రం ఎందుకో గానీ స్టీఫెన్ రవీంద్రకు రాష్ట్ర క్యాడర్ మార్చుకునేందుకు అనుమతి ఇవ్వలేదు.
దాదాపు ఆరు నెలలు వేచి చూసిన ఆయన తిరిగి తెలంగాణకు వెళ్లిపోయారు. ఆ తర్వాత కొంత కాలం మనీష్ కుమార్ సిన్హా ఇంటెలిజెన్స్ వ్యవహారాలు చూసినా ఆయన అక్కడ సెట్ కాలేదు. ఎడిషనల్ ఎస్ పి రవిశంకర్ రెడ్డి కొద్దికాలం రాజకీయ వ్యవహారాల విభాగాన్ని పర్యవేక్షించినా అనతి కాలంలోనే ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారు.
ప్రస్తుతం అడిషనల్ డిజి రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి గా ఉన్నా ఆయన పూర్తి స్థాయి బాధ్యతలను విజిలెన్స్ అండ్ ఎన్ పోర్సుమెంట్ లోనే నిర్వర్తిస్తున్నారు. ఇంటెలిజెన్స్ విభాగం పనులను ప్రస్తుతం వెంకట్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ నిర్వహణలో అత్యంత కీలకమైన ఈ విభాగంలో ఇలా మార్పులు జరుగుతుండటం సమాచార సేకరణకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది.
నిఘా విభాగం నుంచి కీలక సమాచారం వస్తే ప్రభుత్వం తన గమనాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది కానీ ఎందుకో ఆంధ్రప్రదేశ్ లో ఆ పని జరగడం లేదు. ముఖ్యమంత్రికి సన్నిహితులైన పోలీసు అధికారులలో ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతిగా నియమించే క్యాడర్ వారు లేకపోవడం, ఆయనకు అత్యంత సన్నిహితులైన పోలీసు అధికారులు అంతకన్నా తక్కువ క్యాడర్ వారు కావడంతో ఆ పోస్టు భర్తీ కావడం లేదని తెలిసింది.