రాష్ట్రంలో సీఎం జగన్ మరోసారి గెలిపించడం చారిత్రక అవసరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, టిటిడి చైర్మన్ వై. వి. సుబ్బారెడ్డి ఉద్ఘాటించారు. ఈ మేరకు విజయనగరం నగరంలోని లీ పేరడైజ్ కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన విజయనగరం నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేశారు. రానున్న ఎన్నికలలో వైసీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ఆయనకు ఉచిత రీతిన సత్కరించారు.
బుద్ధుని విగ్రహాన్ని బహూకరించారు. సమావేశాన్ని ఉద్దేశించి వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకొని నవరత్నాల రూపంలో మేనిఫెస్టోను రూపొందించారన్నారు. ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత సీఎం జగన్ దేనని అన్నారు. సచివాలయ, వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి తద్వారా ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా ప్రజలకు అందే విధంగా చేస్తున్నారన్నారు. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఆసరా, రైతు భరోసా, ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు.
విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యతనిచ్చి క్షేత్రస్థాయిలో వాటి ఫలాలు అందే విధంగా కృషి చేస్తున్నారన్నారు. అవినీతి రహితంగా ప్రతి పథకం పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడమే ధ్యేయంగా వైసిపి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వృద్ధాప్య పింఛన్లు ఇంటి వద్దకే తెచ్చి ఇస్తున్న వైనం దేశానికే ఆదర్శప్రాయమన్నారు. రానున్న రోజుల్లో 3 వేల రూపాయల పింఛన్లు అందించనున్నట్లు చెప్పారు. 2024లో మరల సీఎం జగన్ ని గెలిపించాల్సిన బాధ్యత అందరి పైన ఉందన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజా రంజిక పాలనపై ప్రతిపక్షాలు దుష్ప్రచారాన్ని చేస్తున్నాయని ఆరోపించారు. నియోజకవర్గంలో 20వేల మందికి జగనన్న ఇల్లు మంజూరు చేయడమే కాకుండా అవి పూర్తి అయ్యేవిధంగా కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 30 లక్షల ఇళ్లను నిరుపేదలకు అందించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
నగరానికి తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి 200 కోట్ల రూపాయలు మంజూరు చేసి రామతీర్థ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు టెండర్ల దశకు చేరిందన్నారు. ప్రపంచ పటంపై భోగాపురం విమానాశ్రయాన్ని అద్భుతంగా ప్రదర్శించే విధంగా జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసే విధంగా త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ విధానాలను ప్రజలలోకి తీసుకువెళ్లి రెట్టింపు ఉత్సాహంతో అత్యధిక మెజార్టీ సాధించే దిశగా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు ఉద్యుక్తులను చేశారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి మాట్లాడుతూ ఎన్నికలలో వైసిపి గెలుపే లక్ష్యంగా శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు కోరారు.
పటిష్టమైన పార్టీగా అవతరించి క్షేత్రస్థాయి నుండి బలోపేతమై ప్రతిపక్ష పార్టీ కుయుక్తులను దీటుగా ఎదుర్కొనే విధంగా కృషిచేసి సీఎం జగన్ ని మరల గెలిపించాలని కోరారు. రానున్న ఎన్నికలలో వైసీపీ జెండా విజయకేతనం ఎగరాలని చెప్పారు. జడ్పీ చైర్మన్ మరియు పార్టీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల నాటికి వైసిపి పూర్తిగి పట్టిష్టం కావాలన్నారు. 2019 నుండి రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పాలన సాగుతుందన్నారు.
దీని ఫలితంగానే గత స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ విజయకేతనం ఎగురవేసిందని గుర్తు చేశారు. సచివాలయ కన్వీనర్ల నియామకం పూర్తయిందని, గృహసారధుల నియామకం పూర్తిచేసి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. విజయనగరంలో వైసిపి గెలుపు భవిష్యత్తుని నిర్దేశించేది స్థానిక నాయకులేనని అన్నారు.
ఈ సమావేశంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, రేవతి దేవి, కెవి సూర్యనారాయణ రాజు,వైసీపీ నగర అధ్యక్షులు ఆశపు వేణు, కోలగట్ల తమన్న శెట్టి, ఫ్లోర్ లీడర్ ఎస్ వి వి రాజేష్, రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి మండల డైరెక్టర్ బంగారు నాయుడు, ఎంపీపీ మామిడి అప్పలనాయుడు,పార్టీ నేతలు లు ముద్దాడ మధు, నడిపేన శ్రీనివాసరావు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, డివిజన్ ఇన్చార్జిలు, అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, మండల పార్టీ నాయకులు, జోనల్ ఇన్చార్జిలు, సచివాలయ కన్వీనర్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు.