మునుపెన్నడూ చూడని వరదలు మనం చూశాo, రాత్రికి రాత్రి వరద తీవ్రత ప్రమాద స్థాయికి చేరుకుంది, అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ సమిష్టిగా కృషిచేసి ప్రాణ నష్టం జరగకుండా కాపాడగలిగామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నయాబజార్ ప్రభుత్వ పాఠశాలలో మున్నేరు బాధిత 1718 కుటుంబాలకు కోటి 50 లక్షల రూపాయల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రిని అడిగిన వెంటనే హుటాహుటిన ఎన్డిఆర్ఎఫ్ బృందాన్ని ఖమ్మంకు పంపారని, నిర్విరామంగా కృషి చేసి అర్థరాత్రి 3 గంటల వరకు శ్రమించి ప్రతి ఒక్కరినీ కాపాడడం జరిగిందన్నారు. వరదల సమయంలో ఎటు వెళ్లకుండా మున్నేరు పరివాహక ప్రాంతాల్లోనే ఉంటూ పేదలకు అండగా నిలిచానని మంత్రి తెలిపారు. వరదలు వచ్చి తగ్గిన వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో వీధులను శుభ్రం చేసినట్లు తెలిపారు.
వరద బాధితులకు సహాయం చేయాలన్న విజ్ఞప్తి మేరకు రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి కోటి రూపాయలు, పువ్వాడ అపర్ణ 50 లక్షల రూపాయలను మొత్తం రూ. 1.50 కోట్లు కలెక్టర్ అకౌంట్ కు బదలాయించి, అట్టి మొత్తం నేడు పంపిణి చేస్తున్నామని అన్నారు. మున్నేరు వరదలో నేను పర్యటించిన క్రమంలో టీవీ లలో చూసిన తన కోడలు చలించి తన తాత గారి కంపెనీ నుండి 50 లక్షల రూపాయలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు.
అడిగిన వెంటనే స్పందించిన దాతలకు ధన్యవాదాలు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, మున్నేరు వరద ముంపు కుటుంబాలు 1,718 లలో ఒక్కో కుటుంబానికి 8,463 వేల రూపాయల చొప్పున అందరికీ సమానంగా పంపిణి చేయడం జరిగిందన్నారు. వరదల సమయంలో నష్టపోయిన వారికి ఎంతో కొంత సహాయం చేయాలని మంత్రి అజయ్ కుమార్ ఎంతో కృషి చేశారని, నష్టపోయిన వరద బాధితులను సర్వే చేయమని చెప్పడంతో వెంటనే సర్వే ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
ప్రభుత్వ పథకాలు అమలు చేయడం ఒక ఎత్తు అయితే, నిధులు సేకరించి ఇవ్వడం మరొక ఎత్తని ఆయన అన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు మంత్రి ప్రతి ఒక్కరికి అండగా ఉన్నారని ఆయన తెలిపారు. మంత్రి కృషి ఫలితంగానే ఇప్పుడు అందరికీ చెక్కులు అందజేయడం జరుగుతుందన్నారు. ఎక్కువగా నష్టపోయిన బొక్కలగడ్డ ప్రాంతం వారు 615 మందికి 51 లక్షల 90 వేల 600 రూపాయలు అందజేసినట్లు కలెక్టర్ అన్నారు.