ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలపై గత కొన్నిరోజులుగా చక్కర్లు కొడుతున్న ముందస్తు ఎన్నికల ప్రచారాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుల్స్టాప్ పెట్టారు. ముందస్తు ఎన్నికలు, మంత్రివర్గ మార్పూ అంటూ సోషల్మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదని ఆయన చెప్పారు.
సోమవారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయ కర్తలు, రీజినల్ ఇన్ఛార్జిలు పాల్గొన్న సమావేశంలో సీఎం జగన్ తాజా రాజకీయ ప్రచారాలపై మాట్లాడారు. షెడ్యూలు ప్రకారమే ఎన్నికలకు వెళ్తున్నట్లు పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. మంత్రుల మార్పుల సహా, ఇతరత్రా రూమర్లపైనా ఎమ్మెల్మేలతో చర్చించారు. రాబోయే కాలంలో ఇలాంటి రూమర్లు మరిన్ని వస్తాయని ఆయన అన్నారు. వాటిని అంతే బలంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు.