పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ నేడు పరిశీలించారు. పరీక్షల బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. ఈ నెల 3 నుంచి ఏప్రిల్ 18 వరకు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం12.45 గంటల వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఒంగోలులోని క్విజ్ హై స్కూల్, పేర్నమిట్ట మరియు సెయింట్ జేవియర్ జూనియర్ కాలేజీ ల వద్ద ఉన్న పరీక్షా కేంద్రములను సందర్శించారు.
అక్కడ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. పరీక్షా కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, స్మార్ట్ వాచ్, మొబైల్ ఫోన్స్, ఐపాడ్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరాదని, పరీక్షా కేంద్రాల పరిసరాల్లో పరీక్షకు కేటాయించిన సిబ్బంది తప్ప ఇతర సిబ్బంది, వ్యక్తులు గానీ ఉండకుండా చూడాలని, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎటువంటి విమర్శలకు తావులేకుండా సమర్ధవంతంగా నిర్వహించడానికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం పరీక్షా కేంద్రాల చీఫ్ సూపెరింటెండెంట్లు తో మాట్లాడి వారికి పలు సూచనలు చేసారు. పరీక్ష జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 175 పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అవకతవకలు జరగకుండా పటిష్ఠమైన భద్రత చర్యలు చేపట్టామని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, పరీక్షా కేంద్రాల దగ్గరలో జిరాక్స్/ ప్రింటింగ్ సెంటర్లు ముగించివేసామని, పరీక్షా సమయంలో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని, జిల్లాలో 16 ఫ్లయింగ్ స్క్వాడ్లు మరియు ప్రతి సర్కిల్ పరిధిలో ఒక మొబైల్ పెట్రోలింగ్ బృందం నిరంతరం తిరుగుతూ ఉంటాయని, ప్రశ్నపత్రాల తరలింపు, సమాధాన పత్రాలు డిపాజిట్ చెయ్యడానికి తగిన ఎస్కార్ట్ ను నియమించామని, కొన్ని పరీక్షా కేంద్రాల వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా జరగడానికి పోలీస్ శాఖ తరఫు నుండి అన్ని చర్యలు తీసుకున్నామని తెలియచేశారు.
పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో అనుమానిత వ్యక్తులు ఉన్నట్లు తెలిస్తే వెంటనే అదుపులోకి తీసుకుంటామని, విద్యా శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరించినా, చిట్టీలు, పుస్తకాలు పెట్టి మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ కు విద్యార్థులు పాల్పడినా వారికి ఎవరైనా సహకరించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఏ పరీక్షా కేంద్రం వద్దయినా ఎటువంటి చిన్న ఘటన జరిగిన వెంటనే DIAL 100/112 లేదా జిల్లా పోలీస్ వాట్సాప్ 9121102266 కు సమాచారం అందించాలని ఎస్పీ తెలియచేసారు. ఎస్పీ వెంట ASP (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, DSB DSP బి.మరియాదాసు, ఒంగోలు డిఎస్పీ యు.నాగరాజు, ఒంగోలు రూరల్ సిఐ శ్రీనివాస రెడ్డి మరియు సిబ్బంది ఉన్నారు.