మద్యపానం నిషేధిస్తానని,కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని, సిపిఎస్ రద్దు చేస్తానన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ ఒక్కటీ అమలు చేయలేకపోయారని,జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా దిగిపోయేముందు అయినా హామీలను అమలు చేసే దమ్ముందా అని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తనదైన ముద్ర వేస్తామని చేసిన ప్రకటన గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన ఏపీ టిడ్కో ఇళ్ళని పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు దక్కకుండా మురగబెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కనీసం జగనన్న కాలనీలలో ఇచ్చిన హామీ మేరకు ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వలేక నిరుపేదల్ని ఊరు బయటకు విసిరి వేశారు అని ఆరోపించారు.సిపిఎస్ రద్దు కై పోరాడుతున్న ఉద్యోగులను జైళ్లలో పెట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది అన్నారు.
రాజధాని అమరావతిని మురగబెట్టిన ఘనుడు మూడేళ్ళుగా మూడు రాజధానులు ఎందుకు ఏర్పాటు చేయలేదు అని రావుసుబ్రహ్మణ్యం ఎద్దేవాచేశారు.ఇక ముందస్తుగా ఎన్నికలు అంటూ చేస్తున్న హడావిడి జగన్మోహన్ రెడ్డికి అచ్చిరాదని, గతంలో ముందస్తు ప్రయోగాలు చేసిన వారికి పట్టిన గతే జగన్మోహన్ రెడ్డికి పడుతుంది అని తెలిపారు. పరిశ్రమలు తేవడంలో విఫలమైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం మద్యం పైన వచ్చే ఆదాయంతో బ్రతకడం సిగ్గుచేటన్నారు.
సంక్షేమ ప్రభుత్వం తెస్తానని బీరాలు పలికిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షోభంలో పడిపోయింది అని గమనించే స్థితిలో జగన్ లేడన్నారు.ముందస్తు ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు అని తెలిపారు.ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి కొత్త మేనిఫెస్టోలేదని,పాత మేనిఫెస్టో వర్కవుట్ కాదని ఇది తెలిసే రానున్న ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులిచ్చి గెలిచే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు అనిపిస్తుంది అన్నారు.
ప్రతిపక్ష పార్టీల నేతల్ని,స్వంత పార్టీ నుండి గెలిచిన విభీషణులను వేధించడం తప్ప నాలుగేళ్ళ పాలనలో ముఖ్యమంత్రి సాధించిన విజయాలు ఏమిటో చెప్పలేని వింతపరిస్థితి జగన్మోహన్ రెడ్డి కి వచ్చిందని ఆయన తెలిపారు.ముందస్తు ఎన్నికలు జరిగితే జగన్ ఇంటికెళ్లడం ఖాయమని రావుసుబ్రహ్మణ్యం తెలిపారు.