ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి నిర్వాకం వల్లే కేంద్రం తన బడ్జెట్లో రాష్ట్రానికి రిక్తహస్తం చూపిందని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ఆరోపించారు. జగన్ తుగ్లక్ చర్యల వల్లే కేంద్ర బడ్జెట్లో ఏపీకి నిధులు శూన్యమైనాయని అన్నారు. ‘వైసీపీ అవినీతి, అసమర్ధ నిర్వాకాలతో రాష్ట్రానికి తీరని నష్టం. కేంద్ర నిధులు రాబట్టే సామర్ధ్యం సీఎం జగన్లో కొరవడింది. రాష్ట్రంలో గత 8నెలల్లో అభివృద్ది పనులన్నీ ఆపేశారు.
పోలవరం సహా, ప్రాజెక్టుల పనులన్నీ నిలిపేశారు. రాజధానికి నిధులు వద్దని ప్రధానికి ఇచ్చిన తొలి వినతిలో జగన్ చెప్పారు. పీపీఏలను రద్దు చేయడం సీఎం మొదటి తిక్కపని. 5దేశాల ఎంబసీలు హెచ్చరించాయి.. కేంద్రం చెప్పింది, కోర్టులు ఆదేశించాయి. అయినా మూర్ఖత్వం వీడలేదు. దీనితో ఏపీకి వచ్చే పెట్టుబడులన్నీ వెనక్కి పోయాయి. సింగపూర్, కియా ఆగ్జిలరీ యూనిట్లు, డేటా సెంటర్, రిలయన్స్, లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ అన్నీ వెళ్లిపోయాయి. 8నెలల్లోనే రూ లక్షల కోట్ల పెట్టుబడులు పోగొట్టారు. 3రాజధానుల నిర్ణయం.. ఇప్పుడింకో తుగ్లక్ చర్య’ అని మాజీ ఆర్థిక మంత్రి విమర్శలు గుప్పించారు. ‘వైసీపీ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్లే ఏపీకి అప్రదిష్ట. 25మంది ఎంపీలనిస్తే కేంద్రం మెడలు వంచుతా.. నిధులు తెస్తానని గొప్పలు చెప్పారు. రెండు కేంద్ర బడ్జెట్లలో రాష్ట్రానికి సాధించింది శూన్యం. ప్రభుత్వ నిర్వాకాల వల్లే కేంద్ర బడ్జెట్లో రిక్తహస్తం. విభజన చట్టం ప్రకారం నిధులు కూడా తెచ్చుకోలేకపోయారు. దీనిపై రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్మోహన్రెడ్డి సంజాయిషీ ఇవ్వాలి’ అని యనమల డిమాండ్ చేశారు.