తమిళనాడులో ఏది చేసినా అతిగానే చేస్తారు. అందులో డౌటే లేదు. హైదరాబాద్లో దిశా ఘటన తరువాత మహిళలు, యువతులు, బాలికలకు రక్షణను మరింత మెరుగు పరిచే విధంగా రాష్ట్ర పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎక్కువ సమయం ఆన్లైన్లో గడుపుతూ అశ్లీల వీడియోలను వీక్షించే వారిని, వాటిని డౌన్లోడ్ చేసే వారిని, షేరింగ్ చేసే వారి గుర్తించారట.
అశ్లీల వీడియోలను వీక్షిస్తున్న మూడు వేల మందిని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే జాబితాగా తయారు చేశారు. వీరిని అరెస్టు చేయడానికి మహిళా పోలీసు అధికారి జయలక్ష్మి నేతృత్వంలోని బృందం సిద్ధమైంది. వీరిలో 24 మంది అడ్రస్సు లభ్యం కావడంతో వారిని అరెస్టు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారట. ఇలా అశ్లీల వీడియోలు చూస్తూ తమకు పదే పదే పట్టుబడితే ఏడేళ్లు జైలు శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరించారు.
తిరుచ్చికి చెందిన క్రిష్టోఫర్ అల్ఫోన్స్ రాజా(40) ఆదవన్ అనే వ్యక్తి ఆదవన్ పేరిట ఓ మెసెంజర్ గ్రూప్ను ఏర్పాటు చేసుకుని అశ్లీల వీడియోల్ని ఇష్టానుసారంగా షేర్ చేయడాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో అతడ్ని అరెస్టు చేశారు. ఈ కేసులో అరెస్టయిన తొలి వ్యక్తి రాజా. మిగిలిన వారు కూడా నేడో రేపో కటకటాల లోకి వెళ్లక తప్పదట.