రైతు బజార్లో బోర్డు మీద ప్రకటించిన ధరలకు మాత్రమే కూరగాయలను విక్రయించాలని, అంతకన్నా ఎక్కువగా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని విజయనగరం జిల్లా సంయుక్త కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు ఆర్ అండ్ బి రైతు బజార్ ను జే.సీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులతో కూరగాయల లభ్యత, ధరలు, తదితర అంశాల పై మాట్లాడారు. ఈ మధ్య కురిసిన వర్షాలకు కూరగాయల పంటలు దెబ్బతినడం వలన బైట మార్కెట్ల నుండి తెప్పించడం జరుగుతోందని, అందువలన ధరలు అధికంగా ఉంటున్నాయని రైతులు తెలిపారు.
ముఖ్యంగా టమాటా చిత్తూరు జిల్లా మదనపల్లి, పలమనేరు నుండి వస్తున్నాయని, అక్కడ కూడా వర్షాలు పడడం వలన పంట నష్టం జరగడం తో అధిక ధరలకు కొంటున్నామని వివరించారు. అయినప్పటికీ బహిరంగ మార్కెట్ల కన్నా 20 శాతం పై బడి తక్కువకే రైతు బజార్ ధరలు ఉన్నాయని అన్నారు. జిల్లాలో కూరగాయల కొరత లేదని, కృత్రిమ కొరతలు సృష్టించి, అధిక ధరలకు విక్రయించ వద్దని ఆదేశించారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో చేయగలిగేది ఏమీ లేదని, మరో 15 రోజుల్లో పరిస్థితులు చక్కబడి, దిగుబడి పెరగవచ్చు నని ఆశాభావం వ్యక్తం చేశారు. వినియోగ దారులకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాలను అందుబాటు లో ఉండేలా చూడాలని సూచించారు. జే.సీ వెంట మార్కెటింగ్ ఏడీ శ్యాం కుమార్, ఎస్టేట్ అధికారి సతీష్ పాల్గొన్నారు.