తొలి వెలుగు యాంకర్ రఘు ను గుర్తు తెలియని వ్యక్తులు కొందరు కిడ్నాప్ చేశారని వార్తలు వచ్చిన తర్వాత కొన్ని గంటలకు పోలీసులు తాము అరెస్టు చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
మఠంపల్లి మండలం గుర్రంపోడు తండా 540 సర్వే నంబర్ ఘర్షణ కేసులో నిందితుడిగా ఉన్న రఘును అరెస్టు చేశామని ఆ తర్వాత హుజూర్ నగర్ జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరు పరిచామని పోలీసులు తెలిపారు.
రఘుకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిందని కూడా పోలీసులే తెలిపారు. వెంటనే ఆయనను హుజూర్ నగర్ జైలుకు తరలించినట్లు కూడా చెప్పారు.
ఈ మొత్తం వ్యవహారాన్ని పోలీసులు అత్యంత రహస్యంగా నిర్వహించారు. ఈ నెల 3వ తేదీ ఉదయం 9 గంటల ప్రాంతంలో మల్కాజిగిరిలోని ఆయన నివాసానికి సమీపంలో జరిగిన ఈ సంఘటనపై జర్నలిస్టు సంఘాలు, మానవహక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.
గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆయనను ఎత్తుకుపోయారని ఆయన సన్నిహితులు చెప్పారు. ఈ మొత్తం వ్యవహారం మల్కాజ్ గిరి సెంటర్ లో ఉన్న ఒక సిసి టివి లో రికార్డు అయింది. బహుశ డ్రస్సు, అడ్రస్సు లేని పోలీసులకు ఈ విషయం తెలియదు.
రఘు అరెస్టు మొత్తం రికార్డు కాగా అది ఇప్పుడు బయటకు వచ్చింది. రఘు ఉదయం 9 గంటల సమయంలో మల్కాజ్ గిరి మార్కెట్ వద్దకు రాగా ముందుగా వచ్చిన ఇద్దరు రఘును చేతులు వెనక్కి విరిచి పట్టుకోగా మరి కొందరు అప్పుడు అక్కడకు తీసుకువచ్చిన కార్ లో అతన్ని నెట్టారు.
ఎవరికి డ్రస్ లేదు. ఎవరూ కూడా నిన్ను అరెస్టు చేస్తున్నాం అని రఘుతో చెప్పలేదు. అసలు వారు పోలీసులని ఈ వీడియో చూసిన వారెవరూ కూడా అనలేరు.
జర్నలిస్టు రఘు గత కొద్ది కాలంగా పలు కుంభకోణాలను వెలికి తీసుకువచ్చారు. 50వేల కోట్ల కోకాపేట కాందీశీకుల భూమి కుంభకోణం, 20 వేల కోట్ల ఐడిపిల్ భూ కుంభకోణం, 5 వేల కోట్ల ఐకియా ముందు భూకుంభకోణం తదితర కుంభకోణాలను ప్రశ్నించినందుకే రఘు కిడ్నాప్ జరిగిందని సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి అన్నారు.
సిసి టీవీ ఫుటేజి బయటకు రావడంతో పోలీసులు ఇలా అరెస్టు చేస్తారా? చట్టం న్యాయం ఎక్కడ ఉన్నాయి అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. (వీడియో)