కరోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో కరోనా వ్యాధి నిర్మూలించేందుకు నాగర్ కర్నూలు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సొంత పరిజ్ఞానాన్ని ఉపయోగించి “ సేఫ్టీ టన్నెల్ స్ప్రే యంత్రం” రూపొందించారు.
తక్కువ ఖర్చుతో, ఎక్కువ సమర్థవంతంగా పనిచేసే “సేఫ్టీ టన్నెల్ స్ప్రే యంత్రం” రూపొందించిన నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ డాక్టర్ వై.సాయి శేఖర్ నేడు దాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు. మనిషి శరీరo పై కరోనా వైరస్ ఉంటే ఈ యంత్రం నుంచి పాస్ అయితే చాలు అది నశించిపోతుంది.
ప్రస్తుతం ట్రయల్ రన్ గా నాగర్ కర్నూల్ పట్టణ పోలీస్ స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేశారు. దీని పనితీరు సంతృప్తికరంగా ఉంటే జిల్లాలో రెడ్ జోన్ లుగా ఉన్న నాగర్ కర్నూలు, కల్వకుర్తి ప్రాంతాలలో ఏర్పాటు చేస్తారు.
ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇదొక అవకాశం గా భావిస్తూ తక్కువ ఖర్చుతో, ఎక్కువ సమర్థవంతంగా పనిచేసే “శరీర సేఫ్టీ టన్నెల్ స్ప్రే యంత్రం” తయారు చేసే ఆసక్తి ఉన్నవారు కూడా సంప్రదించవచ్చు.
ప్రతిభావంతులైన బీ టెక్,ఎం టెక్ విద్యార్థులు ఎవరైనా ఉంటే జిల్లా ఎస్పీ మెయిల్ spcampofficengkl@gmail.com కు పూర్తి అడ్రస్ తో పాటు ఫోన్ నెంబర్ మెసేజ్ పంపాలి. వీటిని తయారు చేసేందుకు అయ్యే ఖర్చులన్నీ జిల్లా ఎస్పీ అందజేస్తారు.
అవి తయారు చేస్తే జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలలో ఏర్పాటు చేయవచ్చునని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం ఉన్న సేఫ్టీ టన్నెల్ స్ప్రే యంత్రం ను అందుబాటులో ఉన్నవారు ఉపయోగించుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వై. సాయి శేఖర్ తెలిపారు. ఎస్పీ దీన్ని తయారు చేసేందుకు ఎలక్ట్రీషియన్ చంద్రశేఖర్ చారి, ప్లంబర్ మహబూబ్ ఫాష , ఎస్పీ గన్ మెన్ ఎ. ప్రభాకర్, ఎస్. శ్రీహరి, డ్రైవర్ పి. శ్రీనివాసులు సహకరించారు.