కరోనా పై ప్రత్యక్ష పోరాటం చేస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది రాపోలు భాస్కర్ ఈ వ్యాజ్యం దాఖలు చేయగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రాణాలకు తెగించి కరోనా వార్తలను కవర్ చేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేయాలని పిటీషనర్ కోర్టుకు తెలిపారు.
సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య పిటీషనర్ తరపు వాదనలు వినిపించారు. లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జర్నలిస్టుకు 25 వేలు ఇచ్చే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ కోరారు.
కరోనా వార్తలను కవర్ చేస్తున్న ప్రతి జర్నలిస్టుకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని కూడా కోరారు. జర్నలిస్టులకు మెడికల్ కిట్లు, మాస్కులు, ఉచితంగా అందించాలని కోరడంతో తెలంగాణ సమాచార శాఖ ముఖ్య కార్యదర్శికి, ప్రెస్ అకాడమీ చైర్మన్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ ధాఖలు చేస్తామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేశారు.