మత విశ్వాసాలు, ఆచార,సంప్రదాయాల్లో రాజకీయ నేతలు కలగజేసుకుంటే,వారి భవితవ్యాన్ని ప్రజలే నిర్ణయిస్తారని సమాజంలోని అన్ని వర్గాల్ని సమదృష్టితో చూడాల్సిన పాలకులు, సున్నితమైన మనోభావాల్ని దెబ్బతీసేలా వ్యవహరించడం, మాట్లాడటం సరికాదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.
ప్రభుత్వంలోని కొందరు నేతలు సంయమనం కోల్పోయి వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని ప్రధాని మోదీపై, యూపీ సీఎం యోగిపై కొందరు నేతలు నోరు జారి అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు.
కొందరు నేతలు బాధ్యతను మరచి విమర్శలు చేయడం ఫ్యాషన్ గా భావిస్తున్నారని , అంతర్వేదిలో రథం కాలిపోతే చెక్క కాలిపోయిందంటూ భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం దారుణమన్నారు.
దేశవ్యాప్తంగా హిందూ సమాజం స్పందిస్తున్నా, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నేతల్ని కట్టడి చేసి, చర్యలు తీసుకోవాల్సిన నేతలు మౌనం వహించడం ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని బండి సంజయ్ పేర్కొన్నారు.