తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు విద్య, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా బిఆర్ ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ముషీరాబాద్ ఇండిపెండెంట్ అభ్యర్థి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. వారికి న్యాయం జరగాలని ఉద్దేశంతోనే ఇండిపెండెంట్గా బరిలోకి దిగానని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిక్కడపల్లి సిటీ లైబ్రరీలో విద్యార్థులు నిరుద్యోగులను కలిశారు. తాను పోటీ చేయడానికి కారణం ఏమిటో వారికి వివరించారు.
అనంతరం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత విద్య వ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యం కాబడ్డాయని తెలిపారు. కేజీ టు పీజీ ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, ఉచిత విద్య వైద్యం కానరావడం లేదన్నారు. రాజకీయ పార్టీలకు విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కనబడడం లేదని, పార్టీలు వారి వారి విమర్శాస్త్రాలకే పరిమితమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాలకు జరుగుతున్న అన్యాయం, విద్యార్థులు నిరుద్యోగుల బాధలను తెలియజేయడానికే బరిలో ఉన్నానని చెప్పారు. ముషీరాబాద్ నియోజకవర్గం ప్రజలు తనకు మద్దతు తెలిపి కెమెరా గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
హైదరాబాద్,సత్యం న్యూస్