కొల్లాపూర్ ఓటర్లకు అమరావతి బహుజన ఐకాస బాలకోటయ్య పిలుపు
తెలంగాణలోని కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కర్నే శిరీష ( బర్రెలక్క)కు కొల్లాపూర్ ఓటర్లు అండగా ఉండి, గెలుపు పట్టం కట్టాలని ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. పాలకుల తప్పులకు, తప్పుడు విధానాలకు సాక్షీభూతంగా శిరీష నిలిచారన్నారు. ఉద్యోగం కోసం చేసిన పోరాటం అసెంబ్లీ బరిలో పోరాటంగా మారిందని చెప్పారు. కొలువులు దొరకని పాలనలో తెలంగాణలోని నిరుద్యోగులందరికీ కొలువులు ఇద్దామన్న ఆమె స్ఫూర్తిని అభినందించారు. చరిత్రలో కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయని, ఎన్నికలు కూడా ఇలాంటి కొత్త పరిణామాలకు అతీతం కాబోదని అంటూ ప్రజలు దీవిస్తే ఏదీ అసాధ్యం కాదనీ అభిప్రాయ పడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో బర్రెలక్క గెలుపు కోసం కొల్లాపూర్ ప్రజలు ఈల గుర్తుపై ఓటేసి కొత్త చరిత్ర రాయాలని బాలకోటయ్య హితవు పలికారు.