కడప జిల్లాలోని కడప మునిసిపల్ కార్పొరేషన్ తో పాటు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు, ఎర్రగుంట్ల, బద్వేలు, రాయచోటి లలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కృషి చేసిన పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లా పోలీసు చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా సువర్ణాక్షరాలతో లిఖించదగ్గట్టుగా ఎన్నికల నిర్వహణ జరిగిందని ఆయన అన్నారు. ఎన్నికలకు సహకరించిన ప్రజలు, రాజకీయ పక్షాలకు, అధికారులు, అనధికారులకు జిల్లా ఎస్.పి ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు.
ముఖ్యంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, సిబ్బంది పోలీసు శాఖకు అందించిన సహకారం మరువలేనిదని ఎస్.పి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో అహరహం శ్రమించిన పోలీసుల సేవలు ప్రశంసనీయమన్నారు.
ప్రజాస్వామ్య స్ఫూర్తి అయిన ఓటు హక్కును వినియోగించుకునేందుకు మానవీయ కోణంలో వృద్దులకు, విభిన్న ప్రతిభావంతులకు, అనారోగ్యంతో ఉన్నవారికి సేవ చేసే అవకాశం పోలీసు అధికారులు, సిబ్బందికి రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.
ఓటు వేసిన తర్వాత వారిని మళ్ళీ పోలింగ్ కేంద్రం నుండి క్షేమంగా బయటకు తీసుకెళ్లి సంబంధీకులకు అప్పగించి..శెభాష్..పోలీస్ అంటూ.. ప్రజలచే జేజేలు పొందే అవకాశం ఒక్క యూనిఫామ్ సర్వీస్ చేసే పోలీసు శాఖకే సాధ్యమని ఎస్.పి తెలిపారు.
ఆయా పోలీసు అధికారులు, సిబ్బంది చేసిన సేవలు జిల్లా పోలీసు చరిత్రలో తలమానికంగా నిలిచిపోతాయన్నారు. నిరుపమానమైన సేవలందించిన పోలీసు అధికారులు, సిబ్బందికి రివార్డులు అందచేయడం జరుగుతుందని జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ తెలిపారు.