తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం కుటుంబంతో సహా వెళ్లి దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఓ వ్యక్తి కనపడకుండా మిస్సయ్యాడు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట స్కూల్ తండాకు చెందిన బుక్యా మోహన్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లారు. ఈ నెల 6 న కామారెడ్డి నుంచి మధ్యాహ్నం 3.35 గంటలకు కృష్ణా ఎక్స్ ప్రెస్ లో బయలుదేరారు. తిరుపతిలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం తిరుపతి నుంచి నిన్న ఉదయం 5.57 గంటలకు తిరుగు పయనమయ్యారు. మధ్యాహ్నం 2:00 గంటల నుంచి 3:00 గంటల మధ్య విజయవాడ దగ్గరలోని భవానిపురం రైల్వే స్టేషన్ వద్ద మోహన్ మిస్సయ్యాడు.
మోహన్ వద్ద ఫోన్, డబ్బులు లేవు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఇతర వ్యక్తి ఫోన్ నుంచి మోహన్ తన కొడుక్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆ సమయం వరకు మోహన్ మిస్సయ్యాడన్న విషయం కుటుంబ సభ్యులకు తెలియదు. అప్పటికే కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు చేరువలో ఉన్నారు. దాంతో చేసేదేమీ లేక హైదరాబాదులో దిగిన కుటుంబ సభ్యులు మోహన్ నుంచి వచ్చిన ఫోన్ కు తిరిగి ఫోన్ చేయగా అతను ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడని, ఇప్పుడే వెళ్లిపోయాడని సమాధానం వచ్చింది. ఆ ఏరియా ఎక్కడ అని వివరాలు అడగగా తాము కూలి చేసుకునే వాళ్ళమని, భవానిపురం వద్దే అతను కనిపించాడని చెప్పారు. దాంతో కుటుంబ సభ్యులు మోహన్ కోసం వెతుకుతున్నారు. ఎవరికైనా కనిపిస్తే 9912655062 నంబరుకు సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.