పర్యావరణ పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని, అందుకే గత 6 సంవత్సరాలుగా హరితహారం కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గంలో ని చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో శుక్రవారం హరితహారం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ నల్లగొండ జిల్లా లో 33 శాతం అడవులు ఉండాల్సి ఉండగా కేవలం 4 శాతం అడవులు ఉండటం బాధాకరం అని అన్నారు.
ప్రతి కుటుంబ సభ్యుడు హరితహారం లో పాల్గొని ఒక మొక్క నాటాలని సూచించారు. మొక్కను నాటిన వారు దానిని సంరక్షించే భాద్యత కూడా తీసుకున్నాప్పుడే హరితహారం లక్ష్యం నెరవేరుతుందని గుత్తా అన్నారు. శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ చిట్యాల మున్సిపాలిటీ లో లక్షానికి మించి మొక్కలు నాటి పచ్చని పందిరిలో పట్టణం ఉండేలా మున్సిపాలిటీ కార్యవర్గం, ప్రజలు భాద్యత తీసుకోవాలని అన్నారు.
అనంతరం రూ. 10 లక్షల అంచనా విలువతో నిర్మించ తలపెట్టిన సిమెంట్ రోడ్డు కు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ కూరేళ్ళ లింగస్వామి, కౌన్సిలర్లు జిట్టా పద్మ బొందయ్య, బెల్లి సత్తయ్య, పందిరి గీత, సిలివేరు మౌనికశేఖర్, కోనేటి కృష్ణ, నాయకులు జడల ఆది మల్లయ్య, పాటి మాధవ రెడ్డి, వెలుపల్లి మదుకుమార్, వనమా వేంకటేశ్వర్లు, గుండెబోయిన సైదులు, ఎండి జమీరొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.